ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ చివరి వరకు పోరాడింది. కానీ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్కు ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో సన్రైజర్స్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు కొత్త ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠీ (15) శుభారంభం ఇవ్వలేకపోయారు.
కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (18) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో హెన్రిక్ క్లాసెన్ (104) చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ఆర్సీబీ బౌలర్లకు గుబులు పుట్టించాడు. అతనికి హ్యారీ బ్రూక్ (27 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. దీంతో ఆ జట్టు 186 పరుగులు చేసింది. ఈ టఫ్ టార్గెట్ను ఆర్సీబీ అద్భుతంగా ఆరంభించింది.

ఛేజింగ్లో తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన కోహ్లీ.. ఎక్కడా నెమ్మదించలేదు. చివరి వరకు అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే 61 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతనికి ఫాఫ్ డుప్లెసిస్ (71) కూడా మంచి సహకారం అందించాడు. దీంతో ఈ జట్టు లక్ష్యం దిశగా దూసుకుపోయింది. చివరకు 19.2 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను చిత్తుచేసింది.
ఈ ఓటమిపై స్పందించిన సన్రైజర్స్ సారధి మార్క్రమ్.. తాము బాగానే బ్యాటింగ్ చేశామని, కానీ అవకాశాలను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోలేకపోయామని అన్నాడు. 'పవర్ప్లేలో కొన్ని కీలకమైన పరుగులు చేయలేకపోయామని అనుకుంటున్నా. హెన్రిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినా అతను గెలిచిన వైపు ఉండలేకపోయాడు. మాకే కాదు.. ఆర్సీబీకి కూడా ఫ్యాన్స్ నుంచి చాలా మద్దతు దొరికింది' అని చెప్పాడు.
'మా ఫ్యాన్స్కు విజయం అందించలేకపోయినందుకు బాధగా ఉంది. మేం క్రీడాకారులం కాబట్టి ఓడిపోవడం ఇష్టం ఉండదు. గెలిచి నవ్వుతూ ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకున్నాం. కానీ ఆర్సీబీ అద్భుతంగా ఆడింది. ఫాఫ్, కోహ్లీ ఇద్దరూ మా అవకాశాలను చంపేశారు. చివర్లో మేం విజయానికి ఎక్కువ దూరంలో లేం. చివరి వరకు పోరాడినా ఓడిపోయాం' అని అభిప్రాయపడ్డాడు.
తమ బౌలింగ్ ఆప్షన్ల గురించి కూడా మార్క్రమ్ వివరణ ఇచ్చాడు. 'భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొందరు ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాం. పవర్ప్లేలో ఒక్కరు మిస్ అయినట్లు అనిపించింది. కానీ అందరూ చాలా ప్రయత్నించారు. కోహ్లీ, ఫాఫ్ ఇద్దరూ ఫుల్ ఫ్లోలో ఉండటంతో ఆ ప్లాన్లు ఫలించలేదు. నితీష్ స్టాట్స్ చూపించకపోయినా.. తను అద్భుతంగా ఆడాడు. క్లాసెన్కు అన్నీ అంత ఈజీగా రాలేదు. అతను ఇదంతా కలలో కూడా ఊహించి ఉండడు. గెలవకపోయినా అతని ఇన్నింగ్స్ మాత్రం సూపర్' అని పేర్కొన్నాడు.