ఐపీఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచులు ఓడిన తర్వాత అద్భుతమైన ప్రదర్శనతో తొలి విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు కొత్తగా కనిపించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ నిర్ణయాన్ని బౌలర్లు నిలబెట్టారు. వరుస పెట్టి పంజాబ్ బ్యాటర్లను పెవిలియన్ పంపారు.
అయితే ఒక పక్క వరుసగా వికెట్లు పడుతున్నా కూడా పంజాబ్ సారధి శిఖర్ ధవన్ (99 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో 11 నెంబర్ ఆటగాడితో కలిసి 50 పరుగులపైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన మహీష్ రాఠీ కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. మిగతా బంతులన్నీ తానే ఎదుర్కొన్న ధవన్ ధనా ధన్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కూడా సాధించాడు.

కానీ ధవన్ సూపర్ ఇన్నింగ్స్ కూడా ఆ జట్టును కాపాడలేకపోయింది. పంజాబ్ నిర్దేశించిన 144 పరుగుల టార్గెట్ను సన్రైజర్స్ సులభంగా ఛేదించింది. రాహుల్ త్రిపాఠీ (74 నాటౌట్), ఎయిడెన్ మార్క్రమ్ (37 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇది ఈ ఐపీఎల్లో సన్రైజర్స్కు తొలి విజయం కావడం గమనార్హం. అలాగే పంజాబ్కు ఇదే తొలి ఓటమి కూడా.
ఈ క్రమంలో తమ జట్టు ఒక బ్యాటింగ్ యూనిట్గా విఫలమైందని, వరుస పెట్టి వికెట్లు కోల్పోవడం తమ జట్టును దెబ్బతీసిందని శిఖర్ ధవన్ అన్నాడు. 'వరుసగా వికెట్లు పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయాం. ఇక్కడ కనీసం 175-180 పరుగులు చేయాల్సింది. వికెట్ చాలా బాగుంది. కానీ సీమ్, స్వింగ్ ఉందీ పిచ్లో. ఈ ఓటమితో మా జట్టు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని విశ్లేషించుకొని మరింత మెరుగవడానికి ప్రయత్నిస్తాం. మా దగ్గర కొందరు అద్భుతమైన కుర్రాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ కెప్టెన్సీ చేయడాన్ని చాలా ఆస్వాదిస్తున్నా. ఈ ఐపీఎల్ను కూడా ఎంజాయ్ చేస్తున్నా' అని ధవన్ వివరించాడు.