ఐపీఎల్ 2023లో బలమైన బౌలింగ్ యూనిట్ ఉన్న జట్లలో సన్రైజర్స్ ఒకటి. కానీ ఈ జట్టు ఆడిన తొలి రెండు మ్యాచుల్లో వికెట్లు తీయడానికి చాలా కష్టపడింది. అయితే పంజాబ్పై మాత్రం సన్రైజర్స్ బౌలర్లు చెలరేగారు. ఒకరితో ఒకరు పోటీ పడినట్లు వికెట్లు తీసుకున్నారు. దీంతో ఏ దశలోనూ పంజాబ్ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. అయితే పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ (99 నాటౌట్) మాత్రం ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తన బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మయాంక్ మార్కండే అయితే ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. దీంతో పంజాబ్ కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే సన్రైజర్స్ ఛేదించింది. రాహుల్ త్రిపాఠీ (74 నాటౌట్), మార్క్రమ్ (34 నాటౌట్) చెలరేగారు. దీంతో సన్రైజర్స్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ఈ విజయంతో వచ్చిన ధీమాను మిగతా మ్యాచుల్లో కూడా కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని మార్క్రమ్ చెప్పాడు. తొలి రెండు మ్యాచుల్లో ఓడినా కూడా ఇది సీజన్ ఆరంభమే కావడంతో అంత సీరియస్గా తీసుకోలేదన్నాడు. ఆటగాళ్లు తమ సహజమైన ఆట ఆడాలని ప్రోత్సహిస్తూ వచ్చామని తెలిపాడు.
అదిల్ రషీద్ వంటి టాప్ స్పిన్నర్ను పక్కన పెట్టి మయాంక్ మార్కండేను ఆడించడం గొప్ప నిర్ణయం కాదన్నాడు. కానీ మార్కండే రాణించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అలాగే రాహుల్ త్రిపాఠీతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సులభంగా ఉంటుందని, అతని సత్తా ఎలాంటిదో అందరికీ తెలుసునని గుర్తుచేశాడు. తమ జట్టుకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉందని, ఆ విషయం ఈ మ్యాచ్తో మరోసారి రుజువైందని ఆనందం వ్యక్తం చేశాడు. సీజన్ను అద్భుతంగా ఆరంభించకపోయినా.. ఈ విజయంతో జట్టు మొమెంటం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.