ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిన సన్రైజర్స్.. రెండో మ్యాచులో కచ్చితంగా గెలుస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. ఎయిడెన్ మార్క్రమ్, క్లాసెన్, మార్కో జాన్సెన్ తిరిగొస్తారని, సన్రైజర్స్ను గెలిపిస్తారని ఫ్యాన్స్ నమ్మారు. కానీ కెప్టెన్గా తొలి మ్యాచ్లో మార్క్రమ్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. క్లాసెన్, జాన్సెన్ ఇద్దరూ ఆడలేదు.
ఇలా వరుస ఓటములతో సన్రైజర్స్ విమర్శల పాలవుతోంది. పంజాబ్తో జరిగే మ్యాచులో కూడా గెలవకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మినీ వేలంలో రూ.13 కోట్లపైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ అత్యంత ఘోరంగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లో 13 పరుగులు చేసిన అతను.. రెండో మ్యాచ్లో కేవలం మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు.

జట్టులో ఎందరో మ్యాచ్ విన్నర్లు ఉన్నా, బలమైన బౌలింగ్ యూనిట్ ఉన్నా కూడా వికెట్లు తీసేందుకు సన్రైజర్స్ ఇబ్బంది పడుతోంది. బ్యాటింగ్లో కూడా అంత గొప్ప ఇన్నింగ్సులు ఎవరూ ఆడటం లేదు. ఇదే విషయాన్ని సూపర్ హిట్ మూవీ 'దసరా' టీం కూడా ఎత్తి చూపింది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా సూపర్గా క్రికెట్ ఆడతాడు. దీనికి సంబంధించిన చిన్న ప్రోమో కట్ చేసిన మూవీ టీం.. 'మా ధరణికి మంచి ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇస్తారా?' అని అడిగింది.
ఇంపాక్ట్ ప్లేయర్ కోసం చూస్తున్నారా? సన్రైజర్స్? అని అడుగుతూ ఒక ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర దసరా మూవీ వంద కోట్ల లీగ్లో చేరింది. ఈ విషయం కూడా తెలిపేలా ఎస్ఎల్వీ మూవీస్ ఈ ట్వీట్ చేసింది. 'మా ధరణి బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టి జోరు మీదున్నాడు. సన్రైజర్స్, మీకు ఇంపాక్ట్ ప్లేయర్ కావాలా? మా ధరణికి మంచి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఎవరైనా రెడీగా ఉన్నారా?' అని అడిగింది.
ఈ ట్వీట్ చూసిన సన్రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం మొఖం ముడుచుకుంటున్నారు. ఇలా ఒక సినిమా టీం కూడా ఎగతాళి చేసే స్థాయికి తమ జట్టు దిగజారిపోయిందని వాళ్లు బాధ పడుతున్నారు. ఇక నుంచి అయినా తమ జట్టు విజయాల బాట పట్టాలని కోరుకుంటున్నారు. మరి పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో అయినా సన్రైజర్స్ విజయాల బాట పడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.