సన్రైజర్స్, లక్నో జట్ల మధ్య మ్యాచ్లో జరిగిన గలీజ్ గొడవ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఇన్నింగ్స్లో పెద్ద గొడవ జరిగింది. ఆ ఇన్నింగ్స్ 19వ ఓవర్ నాలుగో బంతిని అబ్దుల్ సమద్ ఎదుర్కొన్నాడు. ఆ బంతిని బౌలర్ ఫుల్ టాస్ వేశాడు. అది సమద్ నడుము కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చింది.
ఇది గమనించిన అంపైర్లు వెంటనే నోబాల్ ఇచ్చారు. అయితే లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా రివ్యూ కోరాడు. రిప్లేలో సమద్ పూర్తిగా నిలబడి లేడని భావించిన థర్డ్ అంపైర్.. అది నోబాల్ కాదన్నాడు. ఈ నిర్ణయం చూసిన అందరూ షాకయ్యారు. అయితే హైదరాబాద్ ప్రేక్షకులు మాత్రం దీన్ని మరింత సీరియస్గా తీసుకున్నారు.

లక్నో డగౌట్పై తమ ప్రతాపం చూపించారు. కొంతమందేమో 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ లక్నో ఆటగాళ్లను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించారు. ఈ బంతి వేసిన తర్వాత కాసేపు ఆటను ఆపేయాల్సి వచ్చింది. లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్టులు విసిరారు. దీంతో కొంతమంది లక్నో సిబ్బంది తమ డగౌట్ నుంచి మైదానంలోకి పరుగు తీయాల్సి వచ్చింది.
ఈ సమయంలో అంపైర్లు వేగంగా లక్నో డగౌట్ వైపు పరుగు తీశారు. ఈ పరిస్థితి నచ్చని లక్నో సిబ్బంది అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. అంపైర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా లక్నో టీం కోచ్ ఆండీ ఫ్లవర్ అయితే మరీ రెచ్చిపోయాడు. అంపైర్లకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇవి చూసిన నెటిజన్లు ఆండీ ఫ్లవర్పై మండిపడుతున్నారు. హైదరాబాద్ ప్రేక్షకులు చేసింది తప్పేనని, అయితే ఒక వెటరన్ ప్లేయర్గా అంపైర్లకు మర్యాద ఇవ్వడం కూడా ఫ్లవర్కు తెలియదా? అని తిడుతున్నారు. మరికొందరేమో గంభీర్ గ్యాంగ్ అంతా ఇలాగే హద్దు మీరి ప్రవర్తిస్తుంటారని మండిపడుతున్నారు. ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.