సన్రైజర్స్, లక్నో జట్ల మధ్య మ్యాచ్లో జరిగిన గలీజ్ గొడవ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఇన్నింగ్స్లో పెద్ద గొడవ జరిగింది. ఆ ఇన్నింగ్స్ 19వ ఓవర్ నాలుగో బంతిని అబ్దుల్ సమద్ ఎదుర్కొన్నాడు. ఆ బంతిని బౌలర్ ఫుల్ టాస్ వేశాడు. అది సమద్ నడుము కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చింది.
ఇది గమనించిన అంపైర్లు వెంటనే నోబాల్ ఇచ్చారు. అయితే లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా రివ్యూ కోరాడు. రిప్లేలో సమద్ పూర్తిగా నిలబడి లేడని భావించిన థర్డ్ అంపైర్.. అది నోబాల్ కాదన్నాడు. ఈ నిర్ణయం చూసిన అందరూ షాకయ్యారు. అయితే హైదరాబాద్ ప్రేక్షకులు మాత్రం దీన్ని మరింత సీరియస్గా తీసుకున్నారు.

లక్నో డగౌట్పై తమ ప్రతాపం చూపించారు. కొంతమందేమో 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ లక్నో ఆటగాళ్లను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించారు. ఈ బంతి వేసిన తర్వాత కాసేపు ఆటను ఆపేయాల్సి వచ్చింది. లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్టులు విసిరినట్లు తెలిసింది. దీనిపై లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్పందించాడు.
హైదరాబాద్ ప్రేక్షకులు నట్లు, బోల్టులు విసిరింది తమ డగౌట్పై కాదని, ఆటగాళ్లపై అని రోడ్స్ వెల్లడించాడు. 'డగౌట్పై కాదు. ప్లేయర్లపై విసిరారు. ప్రేరక్ మన్కడ్ లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తుంటే, అతని తలపై కొట్టారు' అని షాకింగ్ విషయం వెల్లడించాడు. ఇక్కడ జరిగిన ఘటన రోడ్స్కు ఏమాత్రం నచ్చలేదు.
ఒక ట్విట్టర్ యూజర్ ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన కామెంటరీని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయగా.. దానిపై కూడా జాంటీ రోడ్స్ స్పందించాడు. కాగా, ఈ మ్యాచ్లో ప్రేరక్ మన్కడ్ అదరగొట్టాడు. లక్నోను గెలిపించడంలో 64 పరుగులతో కీలకపాత్ర పోషించాడు. ఈ ఓటమితో సన్రైజర్స్ దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే.