ఐపీఎల్ 2023లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్రైజర్స్ బండి పట్టాలెక్కింది. బలంగా ఉన్న పంజాబ్ను ఓడించిన ఈ జట్టు.. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ను వాళ్ల సొంత మైదానంలో ఓడించింది. సన్రైజర్స్ సారధి ఎయిడెన్ మార్క్రమ్ స్పందించాడు. లక్ష్యాన్ని కాపాడటంలో తమ బౌలర్లు అద్భుతమైన పట్టుదల, నైపుణ్యం కనబరిచారని మెచ్చుకున్నాడు. చాలా ధైర్యంగా బౌలింగ్ చేశారన్నాడు.
'మా బౌలర్లకు హ్యాట్సాఫ్. ముఖ్యంగా ఉమ్రాన్ చివరి ఓవర్లో తనేంటో చూపించాడు. ఈ మ్యాచ్లో మాకు బంతితో శుభారంభం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. చాలా డీప్గా బ్యాటింగ్ చేశాం. ఆ ప్రభావం బౌలర్లపై కూడా పడింది' అని చెప్పాడు. బ్యాటర్లు రాణించడంతో సన్రైజర్స్ 228 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్లో కేకేఆర్ను భువనేశ్వర్ తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. ఆ తర్వాత మార్కో యాన్సెన్ వచ్చి వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్ను పెవిలియన్ చేర్చాడు.

మయాంక్ మార్కండే, నటరాజన్ కూడా చక్కగా బౌలింగ్ చేశారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన పవర్ప్లే చివరి ఓవర్లో మాత్రం కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో రాణా ఏకంగా 28 పరుగులు చేశాడు. ఆ తర్వాత చివరి ఓవర్ వేసిన ఉమ్రాన్.. రింకూ సింగ్ను కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేసింది.
వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైన హ్యారీ బ్రూక్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఈ ఐపీఎల్లో అతనిదే తొలి సెంచరీ కావడం గమనార్హం. హ్యారీ బ్రూక్తోపాటు ఎయిడెన్ మార్క్రమ్ (50), అభిషేక్ శర్మ (32), కూడా అదరగొట్టారు. దీంతోనే సన్రైజర్స్ అంత భారీ స్కోరు చేసింది. బ్రూక్ ఆటతీరుపై తమకు ఎప్పుడూ అనుమానం లేదని ఈ విజయం తర్వాత మాట్లాడుతూ మార్క్రమ్ తేల్చిచెప్పాడు.
'బ్రూక్ ఎంత ట్యాలెంట్ ఉన్న ఆటగాడో మా అందరికీ తెలుసు. పవర్ప్లేలో అతను మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. ఇక భువీ మిస్టర్ రిలియబుల్. అతనిపై ఎప్పుడైనా ఆధారపడొచ్చు. ఈ పిచ్పై బౌలర్లకు చాలా కష్టం. కానీ మా వాళ్లు టెన్షన్ పడకుండా కామ్గా ఉన్నందుకు సంతోషం. వీళ్లందరూ చాల గొప్ప ప్లేయర్లు. కొన్ని విషయాల్లో ఇంకొంచెం మెరుగవ్వాలి. ఒక జట్టుగా అందరం మెరుగవడం ఆనందంగా ఉంది. ఇదే మొమెంటం కొనసాగిస్తామని ఆశిస్తున్నా' అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.