కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ భారీ స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్ (100 నాటౌట్), ఎయిడెన్ మార్క్రమ్ (50), అభిషేక్ శర్మ (32) బ్యాటుతో అదరగొట్టారు. ఛేజింగ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ కొంత తడబడింది.
సన్రైజర్స్ బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 228 పరుగులు చేసింది. ఛేజింగ్లో తొలి ఓవర్లోనే రహ్మనుల్లా గుర్బాజ్ (0)ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్ (10), సునీల్ నరైన్ (0) ఇద్దర్నీ మార్కో యాన్సెన్ అవుట్ చేశాడు. దీంతో కేకేఆర్ తడబడుతుందని అంతా అనుకున్నారు.

కానీ కేకేఆర్ తడబడలేదు. కెప్టెన్ నితీష్ రాణా (41 బంతుల్లో 75) చెలరేగాడు. అతనికి జత కలిసిన ఆండ్రీ రస్సెల్ (3) పెద్దగా రాణించలేదు. అయితే రింకూ సింగ్ (58 నాటౌట్) మరోసారి కేకేఆర్ను గెలిపించేలా కనిపించాడు. చివర్లో 19వ ఓవర్లో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ నటరాజన్ వేసిన ఓవర్లో కూడా రింకూ అద్భుతంగా ఆడాడు. ఆ ఓవర్లో 16 పరుగులు పిండుకున్నాడు.
దీంతో కేకేఆర్ గెలవాలంటే చివరి ఓవర్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పటికే భువీ, నటరాజన్, మార్కో యాన్సెన్ తమ కోటా పూర్తి చేసేశారు. ఇలాంటి పరిస్థితిలో ఉమ్రాన్ మాలిక్కు బంతి ఇచ్చాడు కెప్టెన్ మార్క్రమ్. తను వేసిన తొలి ఓవర్లో 28 పరుగులు ఇచ్చిన ఉమ్రాన్.. చివరి ఓవర్లో 32 పరుగులు కాపాడుతాడా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
దానికితోడు గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్ క్రీజులో ఉన్నాడు. అయితే తనపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని ఉమ్రాన్ తన బౌలింగ్తో మరోసారి గట్టిగా చెప్పాడు. ఈ ఓవర్ తొలి బంతికే శార్దూల్ ఠాకూర్ (12)ను అవుట్ చేశాడు. తర్వాతి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీశాడు. అప్పుడు రింకూ బ్యాటింగ్కు వచ్చాడు.

అయితే అప్పటికే కేకేఆర్ గెలవడం దాదాపు అసాధ్యంగా మారింది. నాలుగు బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ ఒకవేళ ఉమ్రాన్ కనుక నోబాల్స్ వేస్తే మ్యాచ్ చేజారుతుంది. కానీ ఎక్కడా ఒత్తిడికి గురికాని ఉమ్రాన్.. చూడచక్కని బంతులతో ఆకట్టుకున్నాడు. ఈ నాలుగు బంతుల్లో ఒకే ఒక్క సిక్సర్ ఇచ్చాడు. మిగతా బంతుల్లో రింకూకు కూడా భారీ షాట్లు ఆడే అవకావం ఇవ్వలేదు.
దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ను వాళ్ల సొంత మైదానంలోనే ఓడించి, ఈ ఐపీఎల్లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సన్రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా బౌలర్లందరూ వికెట్లు తీసుకోవడం గమనార్హం. మార్కో యాన్సెన్, మయాంక్ మార్కండే చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.