కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్.. పేలవంగా ఆడుతూ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో మాత్రం బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభం నుంచే కోల్కతా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.
సన్రైజర్స్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (9), రాహుల్ త్రిపాఠీ (9) ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో ఈ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. అయితే హ్యారీ బ్రూక్ (100 నాటౌట్)కు జత కలిసిన కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (50) కూడా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. ఆ మరుసటి బంతికే మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ (17 బంతుల్లో 32) కూడా ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో సన్రైజర్స్ సులభంగా 200 పైగా స్కోరు చేసేలా కనిపించింది. అయితే ధనాధన్ షాట్లు ఆడుతున్న అతను కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన హెన్రిక్ క్లాసెన్ (16 నాటౌట్) కూడా బడా షాట్లు ఆడాడు. ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కడంతో కేవలం ఆరు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో చెలరేగాడు. దీంతో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228/4 పరుగుల భారీ స్కోరు చేసింది.

కోల్కతా బౌలర్లు ఎంత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మధ్యలో ఇన్నింగ్స్ను కట్టడి చేసేందుకు కేకేఆర్ స్పిన్నర్లు ప్రయత్నించారు. కానీ మార్క్రమ్, అభిషేక్ ఇద్దరూ ఈ స్పిన్నర్లపై ఎదురు దాడి చేశారు. భారీ షాట్లతో రెచ్చిపోయారు. అయితే సన్రైజర్స్పై ఎప్పుడూ చెలరేగే ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్లో కూడా ఆకట్టుకున్నాడు. కేవలం 2.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను.. సన్రైజర్స్ కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు తన ఖాతాలో వేసుకున్నాడు. సూయష్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.