కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులో కూడా సన్రైజర్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ విఫలమయ్యాడు. మినీ వేలంలో అతన్ని కూడా మంచి ధరకే సన్రైజర్స్ కొనుగోలు చేసింది. అతని కోసం ఏకంగా రూ.8.25 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ అతను ఈ సీజన్లో తన ధరకు తగ్గ న్యాయం చెయ్యలేదు. దేశవాళీల్లో చక్కగా రాణించడంతో అతనికి ఇంత ధర పెట్టింది సన్రైజర్స్.
ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న మ్యాచ్లో హ్యారీ బ్రూక్తో కలిసి ఓపెనింగ్ చేసిన మయాంక్.. క్రీజులో తడబడ్డాడు. అంత కాన్ఫిడెన్స్గా ఆడలేకపోయాడు. ఈ మ్యాచ్లో 13 బంతులు ఎదుర్కొన్న మయాంక్ కేవలం 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆండ్రీ రస్సెల్ వేసిన బంతిని ఆడబోయి వరుణ్ చక్రవర్తికి సులభమైన క్యాచ్ ఇచ్చాడు. ఇది రస్సెల్ ఈ మ్యాచ్లో వేసిన తొలి బంతే కావడం గమనార్హం.

అంతకుముందు ఆడిన మ్యాచుల్లో కూడా మయాంక్ పెద్దగా రాణించలేదు. పంజాబ్తో ఆడిన మ్యాచ్లో 21 పరుగులు చేశాడు. అంతకుముందు లక్నో చేతిలో సన్రైజర్స్ ఓడిన మ్యాచ్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రాజస్థాన్తో ఆడిన మొదటి మ్యాచ్లో 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ అతనికి పెట్టిన ధరకు మాత్రం న్యాయం చెయ్యలేకపోయాడు. దీంతో అతనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇలాగైతే మయాంక్ ఆడటం ఎందుకని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మయాంక్ అవుటైన కాసేపటికే చక్కగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠీ (9) కూడా పెవిలియన్ చేరాడు. అతను కూడా రస్సెల్ బౌలింగ్లోనే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని కీపర రహ్మనుల్లా గుర్బాజ్ సులభంగా అందుకోవడంతో త్రిపాఠీ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. ఇలా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్రైజర్స్ను హ్యారీ బ్రూక్, కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆదుకున్నారు. ఇద్దరూ అద్భుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు.