కోల్కతా, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన అతను.. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో అతన్ని రూ.13 కోట్లు పెట్టి అనవసరంగా కొనుగోలు చేశారని ఫ్యాన్స్ కూడా చికాకు పడ్డారు. ఇలా తనను విమర్శించిన వారికి బ్రూక్ అదిరిపోయే బదులిచ్చాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలి బంతి నుంచే కోల్కతా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మధ్యలో స్పిన్నర్ల బౌలింగ్లో కొంత తడబడ్డాడు. తను ఎదుర్కొన్న తొలి 12 బంతుల్లోనే 32 పరుగులు చేసిన అతను.. ఆ తర్వాత ఎదుర్కొన్న 20 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సమయంలో కేకేఆర్ స్పిన్నర్లు రంగంలోకి దిగారు. వాళ్లను ఎదుర్కోవడంలో బ్రూక్ కొంత తడబడ్డాడు.

దీంతో ఎయిడెన్ మార్క్రమ్, ఆ తర్వాత అభిషేక్ శర్మ స్పిన్నర్లను ఎదుర్కోవడం మొదలు పెట్టారు. ఇలా చేయడంతో బ్రూక్ పని సులువైంది. అతను సింగిల్ తీసుకొని వీళ్లకు స్ట్రైకింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ పేసర్లు రంగంలోకి దిగగానే బ్రూక్ మళ్లీ తన బాదుడు మొదలు పెట్టాడు. ఫీల్డింగ్లో ఉన్న గ్యాప్లను చక్కగా గుర్తించి చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు. ఫ్యాన్స్ కూడా ఇప్పటి దాకా ఏం చేస్తున్నావ్ గురూ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హ్యారీ బ్రూక్ ఈ ఏడాది మంచి ఫామ్ కనబరిచాడు. అంతకుముందు జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో కూడా సెంచరీ సహా అదిరిపోయే ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఆడిన టెస్టు మ్యాచుల్లో కూడా అద్భుతంగా ఆడాడు. దీంతో ఈ ఐపీఎల్లో కూడా చెలరేగుతాడని అంతా అనుకున్నారు. అయితే తొలి మూడు మ్యాచుల్లో ఘోరంగా ఆడటంతో.. అతనిపై తెగ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సెంచరీ చేయడంతో ఆ విమర్శలకు సమాధానం చెప్పినట్లు అయింది.