ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో డీసీ గెలిచింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి అనుకున్న ఆరంభం దక్కలేదు. ఆరంభం నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఆరు మ్యాచుల తర్వాత ఈ ఐపీఎల్లో తొలి సిక్సర్ కొట్టిన డేవిడ్ వార్నర్ కూడా పెద్దగా రాణించలేదు.
అయితే మనీష్ పాండే (32), అక్షర్ పటేల్ (34) ఇద్దరూ ఫర్వాలేదు అనిపించారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఛేజింగ్లో హైదరాబాద్ కూడా ఆరంభం నుంచే తడబడింది. హ్యారీ బ్రూక్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. మిగతా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (49), హెన్రిక్ క్లాసెన్ (31), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్) మాత్రమే పోరాడారు.

మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం స్కోర్లు కూడా చెయ్యలేకపోయారు. దీంతో సన్రైజర్స్ తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ గురించి ఢిల్లీ కీలక ప్లేయర్ అక్షర్ పటేల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఢిల్లీ బ్యాటింగ్ సమయంలో తను అప్పుడే బ్యాటింగ్కు రావాలని అనుకోలేదన్నాడు. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగాలని అనుకున్నట్లు చెప్పాడు.
'మిడిలార్డర్ బ్యాటర్లు వెంట వెంటనే అవుటైపోతున్న సంగతి నాకు తెలీదు. అప్పుడే కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నా. ప్రశాంతంగా కూర్చొని అది తాగుదాం అనుకునే సమయంలో నేను బ్యాటింగ్కు రావలసి వచ్చింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడ్డాయని తెలిసి.. ఆ కాఫీ కప్పును అలాగే వదిలేసి వచ్చి ఆడా.' అని అక్షర్ వెల్లడించాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ను నిలబెట్టిన బ్యాటర్లలో అక్షర్ ఒకడు.
అందుకే అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది. క్రీజులోకి వచ్చే సరికే చక్కగా ఆడుతున్న మనీష్ పాండే తనకు కీలక సలహా ఇచ్చాడని అక్షర్ చెప్పాడు. 'మేం ఇద్దరం ఈ ఇన్నింగ్స్ను ఎంత డీప్గా తీసుకెళ్తే అంత మంచిదని పాండే నాతో అన్నాడు. స్కోరు బోర్డుపై ఒక మోస్తరు స్కోరు అయినా ఉంటే.. వాళ్లకు గట్టి ఫైట్ ఇవ్వొచ్చు అనేది మా భావన' అని అక్షర్ వివరించాడు. వీళ్లిద్దరి బ్యాటింగ్ వల్లనే ఢిల్లీ ఆ స్కోరైనా చేసిందనడం అతిశయోక్తి కాదు.