ఈ ఐపీఎల్లో తొలి విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలవడం సన్రైజర్స్కు చాలా ముఖ్యం. ఇప్పటి వరకు సన్రైజర్స్ కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఇంకా ఓడిపోతూ ఉంటే ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం. కానీ సన్రైజర్స్ గెలవాలంటే మాత్రం రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్ను పక్కన పెట్టాల్సిందే.
ప్రస్తుతం ఐపీఎల్లో అత్యంత చెత్త ఫామ్లో ఉన్న బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ ఒకడు. దేశవాళీల్లో ఫర్వాలేదనిపించడంతో అతన్ని భారీ ధరకు సన్రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన అతను కేవలం 115 పరుగులే చేశాడు. అతని స్ట్రైక్ రేటు 106.48 కూడా చాలా పేలవంగా ఉందనే చెప్పాలి. చెన్నైతో జరిగిన మ్యాచ్లో అతన్ని లోయర్ ఆర్డర్లో పంపించినా ఫలితం లేకపోయింది.

ఓవరాల్ ఐపీఎల్ రికార్డు చూసుకున్నా మయాంక్ది అంత గొప్ప రికార్డేం కాదు. మొత్తం 119 ఐపీఎల్ మ్యాచుల్లో 22.44 సగటు, 132 స్ట్రైక్ రేటుతో రాణించాడీ కర్ణాటక బ్యాటర్. కానీ అతని గణాంకాల్లోకి కొంచెం డీప్గా వెళ్తే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. కేవలం 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో మాత్రమే మయాంక్ అద్భుతంగా రాణించాడు. ఈ రెండు సీజన్ల బ్యాటింగ్ లెక్కలు తీసేస్తే అతని సగటు కేవలం 18.31 మాత్రమే.
అంతేకాదు ఈ రెండు సీజన్లు తీసేస్తే అతని స్ట్రైక్ రేటు కూడా 125 మాత్రమే. ఇలాంటి ఆటగాడిని జట్టులో ఉంచుకోవడం వల్ల సన్రైజర్స్కు నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు. వీటన్నింటి కన్నా మరో ముఖ్యమైన కారణం.. సన్రైజర్స్లో సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేకపోవడమే. ఓపెనర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు సన్రైజర్స్ బ్యాటింగ్ అంతా రైట్ హ్యాండ్ బ్యాటర్లే. కేవలం అభిషేక్ శర్మ మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ ఆడతాడు.
దీని వల్ల ప్రత్యర్థి కెప్టెన్లు ఫీల్డింగ్ సెట్ చేయడానికి పెద్దగా కష్టపడటం లేదు. కాబట్టి ఢిల్లీతో జరిగే మ్యాచ్లో మయాంక్కు విశ్రాంతి ఇచ్చి, కొత్త కుర్రాడు వివ్రాంత్ వర్మను ఆడిస్తే బెటర్. దేశవాళీల్లో మంచి రికార్డు ఉన్న అతను కనుక క్లిక్ అయితే సన్రైజర్స్ రాత మారడం ఈజీ. అంతేకాదు, మయాంక్కు కూడా మంచి రెస్ట్ దొరికినట్లు అవుతుంది. ఆ తర్వాత మంచి ఫామ్తో మళ్లీ జట్టులోకి రావొచ్చు.