ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలుపెట్టాయి. సన్రైజర్స్ హైదరాబాద్ పదునైన వ్యహాలతో మెగా ఆక్షన్లో బరిలోకి దిగుతోంది. రిటైన్ లిస్ట్ను ప్రకటించడంలోనే ఎస్ఆర్హెచ్ సీఈవో కావ్య మారన్ సంచలనం సృష్టించింది. రిటైన్డ్ హిస్టరీలోనే హెన్రిచ్ క్లాసెన్కు అత్యధిక రూ.23 కోట్లు చెల్లించింది.
అయితే మిగిలిన రూ.45 కోట్లతో సన్రైజర్స్ దాదాపు 20 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కావ్య మేడమ్ ఇతర ఫ్రాంచైజీల ఊహాలకు అందకుండా ప్రణాళికలు రచిస్తోంది. మెగా వేలంలో సొంతం చేసుకోవాల్సిన ఆటగాళ్ల లిస్ట్ను దాదాపుగా ఖరారు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను రూ.75 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కమిన్స్ మినహా మిగిలిన ఆటగాళ్లందరూ టాప్-5లో వచ్చేవాళ్లు. అంతేగాక రిటైన్ లిస్ట్లో ముగ్గరు విదేశీ ప్లేయర్లే.

దీంతో తుదిజట్టు ఆధారంగా వేలంలో ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని సన్రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోంది. విధ్వంసకర బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఖరారు కావడంతో మూడో స్థానం కోసం సందర్భాన్ని బట్టి గేర్ మారుస్తూ, ఇన్నింగ్స్కు ఇరుసులా మారే ఆటగాడిని తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ యోచిస్తోంది. ఈ స్థానానికి కేన్ విలియమ్సన్తో పాటు ఎయిడెన్ మార్క్రమ్లలో ఒకరిని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మాజీ కెప్టెన్లు వేలంలో భారీ ధర పలికితే బ్యాకప్ ఆప్షన్గా రాహుల్ త్రిపాఠిని పెట్టుకుంది.
ఇక నాలుగు, అయిదు స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ఖరారయ్యారు. దీంతో ఆరో స్థానంలో ఫినిషర్ రోల్లో సత్తాచాటే ప్లేయర్లు ఎస్ఆర్హెచ్కు కావాల్సి ఉంది. ఈ క్రమంలో తక్కువ ఖర్చులో దక్కే సర్ఫరాజ్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి ప్లేయర్లను తీసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ కమిన్స్ను మినహాయిస్తే మిగిలిన నలుగురు కచ్చితంగా బౌలర్లు కావాల్సి ఉంది. అందులో ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేదా స్పిన్ ఆల్రౌండ్ కావాలి. ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ, అన్క్యాప్డ్ ఆర్టీఎమ్ కార్డ్తో మయాంక్ మార్కండేను దక్కించుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. అలాగే అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్కు బిడ్ వేయాలని చూస్తోంది.
భారత ఫాస్ట్ బౌలర్లు భారీ ఖర్చు వెచ్చించాలని సన్రైజర్స్ నిర్ణయించుకుంది. ముందుగా తమ బౌలర్లు నటరాజన్, భువనేశ్వర్ కుమార్ను తిరిగి దక్కించుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. వాళ్లు దక్కిన తర్వాత ఎడమచేతి వాటం బౌలర్లు ఖలీల్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్ కోసం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాలని భావిస్తోంది. ఈ ప్లేయర్లు దొరకని సందర్భంలో తుషార్ దేశ్పాండే, ముకేశ్ కుమార్లను కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని యోచిస్తోంది. ఇక ఆల్రౌండర్లుగా షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్లతో పాటు వెంకటేశ్ అయ్యర్, అఫ్గాన్ ప్లేయర్ మహ్మద్ నబీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఆటగాళ్లతో పాటు తక్కువ ధరకు సొంతమయ్యే వాళ్లను తీసుకోవాలనుకుంటుంది.
మెగా వేలంలో సన్రైజర్స్ దక్కించుకోవాలని చూసే ఆటగాళ్ల జాబితా (అంచనా)
విదేశీ ప్లేయర్లు: కేన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్కండే, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ
భారత ప్లేయర్లు: రాహుల్ త్రిపాఠి, సర్ఫరాజ్ ఖాన్, అబ్దుల్ సమద్, సుయాశ్ శర్మ, మయాంక్ మార్కండే, నటరాజన్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, తుషార్ దేశ్పాండే, ముకేశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, షాబాద్ అహ్మద్, వెంకటేశ్ అయ్యర్.