ఐపీఎల్-2024లో మెగా పోరుకు సమయం ఆసన్నమైంది. ఫైనల్ బెర్తు కోసం క్వాలిఫయిర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇవాళ చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు చెపాక్ వేదికగానే ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్తో పోటీపడుతుంది.
ఈ సీజన్లో అదిరే విజయాలు, రికార్డు స్కోరులతో రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్కు క్వాలిఫయిర్-1లో చుక్కెదురైంది. కేకేఆర్ చేతిలో ఓడింది. ఈ పరాజయంతో కొన్ని పాఠాలు నేర్చుకున్న ఎస్ఆర్హెచ్ బలమైన రాజస్థాన్ను ఢీ కొననుంది. మరోవైపు లీగ్ దశ ఆఖర్లో వరుసగా ఓటములు చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో జూలు విదిల్చింది. ఆర్సీబీని ఓడించి సన్రైజర్స్తో సమరానికి సిద్ధమైంది.

అయితే గణాంకాల పరంగా చెపాక్ మైదానం సన్రైజర్స్ హైదరాబాద్ కంటే రాజస్థాన్ రాయల్స్కు ఎక్కువగా అనుకూలంగా ఉంది. ఈ మైదానంలో ఎస్ఆర్హెచ్ ఆడిన పది మ్యాచ్ల్లో కేవలం ఒకే విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ తొమ్మిదింట్లో రెండు సార్లు గెలిచింది. కానీ ఇవాళ హైదరాబాదే జట్టే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
క్వాలిఫయిర్-1లో ఓటమి చవిచూడటానికి ఎస్ఆర్హెచ్ తీసుకున్న దూకుడు నిర్ణయాలే ప్రధాన కారణంగా నిలిచాయి. కమిన్స్ పిచ్ను సరిగా అర్థం చేసుకోలేక తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం, మెరుగైన తుదిజట్టును ఎంచుకోవడంలో విఫలమవ్వడం జట్టును దెబ్బకొట్టాయి. ఈ పొరపాట్లను కీలక మ్యాచ్కు ముందే గ్రహించడం సస్రైజర్స్కు సానుకూలమే. దీంతో జట్టులో మార్పులు, ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.
ఈ సీజన్లో రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సత్తాచాటుతున్నాడు. కానీ బౌల్ట్పై ట్రావిస్ హెడ్కు మెరుగైన రికార్డు ఉంది. 30 బంతుల్లో హెడ్ 52 పరుగులు చేశాడు. బౌల్ట్ బౌలింగ్లో ఒక్కసారి కూడా హెడ్ ఔటవ్వలేదు. ఇది ఆరెంజ్ ఆర్మీకి గుడ్ న్యూసే. అంతేగాక సన్వీర్ సింగ్ స్థానంలో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ను ఎస్ఆర్హెచ్ జట్టులోకి తీసుకువస్తుంది. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది.
అలాగే ఇవాళ ఉపయోగించే పిచ్కు ఓ వైపు బౌండరీ దగ్గరగా ఉంటుంది. రాజస్థాన్ జట్టుతో పోలిస్తే హైదరాబాద్ టీమ్లోనే హిట్టర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక చెపాక్ పిచ్పై అనుభవం ఉన్న నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఎస్ఆర్హెచ్తో ఉండటం మరో సానుకూలాంశం. అలాగే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పూర్తి ఫిట్నెస్లో లేకపోవడం కూడా సన్రైజర్స్కు కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్పై హైదరాబాద్ ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.