రాజస్థాన్ రాయల్స్కు మరోసారి హార్ట్ బ్రేక్ అయ్యింది. వరుసగా 16 సీజన్లను ట్రోఫీ సాధించకుండానే ముగించింది. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో ఆర్ఆర్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరోసారి విజేతగా నిలవలేకపోయింది. అయితే ఐపీఎల్-2024 సీజన్ను ఘనంగా ఆరంభించింది. హాఫ్ సీజన్ ముగిసేసరికి టేబుల్ టాప్లో ఉంది.
కానీ లీగ్ దశను పేలవంగా ముగించింది. చివరి అయిదు మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. అందులో ఓ మ్యాచ్ రద్దు అయ్యింది. అయితే కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీపై గెలిచి క్వాలిఫయిర్-2కు చేరుకుంది. కానీ ఈ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 36 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

మందకొడి పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 175 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో, 4x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. రాహుల్ త్రిపాఠి (37; 12 బంతుల్లో, 5x4, 2x6), ట్రావిస్ హెడ్ (34; 28 బంతుల్లో, 3x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/27), ట్రెంట్ బౌల్ట్ (3/45) చెరో మూడు, సందీప్ శర్మ (2/25) రెండు వికెట్లు తీశారు.
ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (56*; 35 బంతుల్లో, 7x4, 2x6), యశస్వీ జైస్వాల్ (42; 21 బంతుల్లో, 4x4, 3x6) పోరాడారు. ఎడమచేతి వాటం స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ (3/23) మూడు, అభిషేక్ శర్మ (3/24) రెండు వికెట్లతో రాజస్థాన్ను చిత్తుచేశారు. అయితే రాజస్థాన్ ఓటమికి పేలవ ప్రణాళికలే కారణమని మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ అన్నారు.
హెట్మెయిర్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించకపోవడమే రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణమని తెలిపారు. లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్లకు హెట్మెయిర్ కౌంటర్ ఎటాక్ ఇస్తూ బ్యాటింగ్ చేసే వాడని, దీంతో మ్యాచ్ మలుపు తిరిగేదని మాజీలు అభిప్రాయపడ్డారు. ''హెట్మెయిర్ను ఆలస్యం బరిలోకి దించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతన్ని ముందుగా బ్యాటింగ్కు పంపించాల్సింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఇద్దరు ఎడమచేతివాటం స్పిన్నర్లు ఉన్నారు. ఆ సమయంలో దూకుడుగా ఆడే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ క్రీజులోకి వస్తే మ్యాచ్ మరోలా ఉండేది'' అని సెహ్వాగ్ అన్నాడు.