ఐపీఎల్ 2025 సీజన్ను భారీ విజయంతో ఘనంగా ఆరంభించింది సన్రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఈ కొండంత లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తడబడింంది. బ్యాటింగ్ ఊపు సరిపోలేదు. దీంతో ఆ జట్టు 242/6 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
మేం అది సరిగ్గా చేయలేకపోయాం..
అయితే మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓటమికి గల కారణాలను తెలిపాడు. తమ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు.
"నేను అనుకున్నట్టుగానే మ్యాచ్ కఠినంగా సాగింది. SRH గొప్పగా ఆడింది. కానీ మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. ఈ రోజు జరిగిన తప్పిదాల గురించి చర్చించి, సరిదిద్దుకుంటాం. బౌలింగ్ ముందుగా ఎంచుకోవాలని మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. కాకపోతే మేం మా ప్లాన్ ను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సింది. అదే మా ఓటమికి కారణం. బోర్డుపై 280 పరుగులు ఉంటే ఛేదించడం కాస్త కష్టమే. నేను టాస్ సమయంలో 200 పరుగులు ఊహించాను. కానీ ఆ తర్వాత 220-240 పరుగులు సరిపోతుందని అనుకున్నా. అది జరగలేదు. అయితే, ఇక్కడ కొన్ని అనుకూల విషయాలు ఉన్నాయి - ధ్రువ్, సంజు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తర్వాత హెట్టి, శివమ్ కూడా బాగా ఆడారు. తుషార్ చక్కగా బౌలింగ్ చేశాడు. శాండీ పాజీ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని, ఓటమిని మర్చిపోతాం. " అని చెప్పుకొచ్చాడు.
