
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు పరాజయాలకు తాను బ్రేక్ వేసినందుకు చాలా సంతోషంగా ఉందని స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ తెలిపాడు. మరోసారి ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశం ఇచిన సన్రైజర్స్ జట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్ 2021లో వరుసగా ఐదు ఓటములను ఎదుర్కొన్న ఎస్ఆర్హెచ్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. సోమవారం రాత్రి దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదటగా సిద్ధార్థ్ కౌల్ (2/36), భువనేశ్వర్ కుమార్ (1/28), రషీద్ ఖాన్ (1/31) రాజస్థాన్ జట్టును కట్టడి చేయగా.. జేసన్ రాయ్ (60; 42 బంతుల్లో 8×4, 1×6), కేన్ విలియమ్సన్ (51 నాటౌట్; 41 బంతుల్లో 5×4, 1×6) జట్టును విజయపథంలో నడిపించారు. ఐపీఎల్ 2021లో సన్రైజర్స్కు ఇది రెండో విజయం మాత్రమే. ఇంకా టోర్నీలో ఎస్ఆర్హెచ్ 4 మ్యాచులు ఆడనుండగా.. అన్ని గెలిచినా ప్లే ఆఫ్ చేరడం అసాధ్యమే.
అద్భుత హాఫ్ సెంచరీ బాదిన జేసన్ రాయ్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాయ్ మాట్లాడుతూ.. 'ఈ విజయం నాకు అత్యంత సంతోషాన్నిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన సన్రైజర్స్కు కృతజ్ఞతలు. ఎస్ఆర్హెచ్ జట్టు పరాజయాలకు నా ఇన్నింగ్స్ బ్రేక్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొన్ని గొప్ప ప్రదర్శనలు చూసాం. నాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు రావడం ఆనందంగా ఉంది. అతికి పోకుండా.. నా గేమ్ నేను ఆడాను. తొలి వికెట్ భాగస్వామ్యంలో సాహా కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో నాపై ఒత్తిడి తగ్గింది. నాకు ఇది కఠినమైన టోర్నమెంట్ అనే చెప్పాలి. అయినా నవ్వుతూ ముందుగు సాగాలి ' అని అన్నాడు.
సన్రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ... 'ఈ విజయం చాలా బాగుంది. మ్యాచ్లో జట్టులోని ప్రతి ఒక్కరు ఎలా ఆడాలనే దానిపై ముందే స్పష్టతతో ఉన్నాం. మ్యాచ్లో కొన్ని సందర్భాలు కీలకంగా మారాయి. మొదటగా బంతితో రాజస్థాన్ను కట్టడి చేశాం. తర్వాత బ్యాటింగ్లో మంచి శుభారంభం దక్కింది. జేసన్ రాయ్ ఎంత బాగా ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను చేయాల్సిన పని చేశాడు. ఏ జట్టు మీదైనా రాయ్ ఇలాగే ఆడతాడు. టోర్నీలో ఇంకొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మా జట్టులోని లోపాలను సరిదిద్దుకొని బాగా ఆడాలి' అని చెప్పాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ సోమవారం రాత్రి రాజస్థాన్పై నెగ్గినా.. ఇప్పటికే 8 మ్యాచ్ల్లో ఓడటంతో ప్లే ఆఫ్ రేసుకు దాదాపు దూరమైంది. అయితే సన్రైజర్స్ ప్లే ఆఫ్ చేరేందుకు ఓ చిన్న అవకాశం మిగిలే ఉంది. ఇక నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే ప్రతి మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు ఉన్న నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచులు ప్రతి జట్టు ఓడాల్సి ఉంటుంది. అదే సమయంలో సన్రైజర్స్ జట్టుకు మిగి ఉన్న 4 నాలుగు మ్యాచుల్లో కూడా గెలవాలి. ఇక్కడ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవడం హైదరాబాద్ జట్టుకు కీలకం. అయితే సన్రైజర్స్ ఇకపై ఒక్క మ్యాచ్ ఓడినా.. అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది.