ఉప్పల్ స్టేడియాన్ని రప్పా.. రప్పా.. రఫ్ఫాడించాడు, ఊచకోత కోశాడు, ఉప్పెనలా విరుచుకుపడ్డాడు, రికార్డులు బద్దలకొట్టాడు, సెలక్టర్లకు గట్టి సందేశాం ఇచ్చాడు, టీమిండియాలోకి కమ్బ్యాక్ గ్యారెంటీ, బీసీసీఐ మళ్లీ జట్టులోకి తీసుకోవాల్సిందే... ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా.. ఈ అభిప్రాయాలన్నీ సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకున్నవే. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచులో సెంచరీతో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 106 నాటౌట్ గా నిలిచాడు. దీంతో.. క్రమశిక్షణరాహిత్యంతో బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి, జాతీయ జట్టుకు దూరమైన అతడిని.. మళ్లీ తీసుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్లు చేస్తున్నారు.
సెలక్టర్లకు గట్టి సందేశాం
వన్డేల్లో, టీ20ల్లో వికెట్ కీపర్గా, బ్యాటర్గా .. టీమిండియాకు కీలకంగా వ్యహరించాడు ఇషాన్ కిషన్. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన అతి తక్కువ మంది బ్యాటర్లలో ఒకడు. అయితే జాతీయ జట్టులో ఆడే ఆటగాళ్లు.. దేశవాళీలోనూ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ మాటలను ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు. బేఖాతరు చేశాడు. దీంతో ఆగ్రహించిన బీసీసీఐ.. అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ ను తొలిగించింది. అతడిపై వేటు వేసి జట్టుకు దూరం చేసింది. దీంతో అతి చిన్న వయసులోనే ఎన్నో ఘనతలు అందుకున్న ఇషాన్.. అంతే చిన్న వయసులో జాతీయ జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. అలా అతడు టీమిండియా తరఫున చివరిసారిగా 2023 నవంబర్ లో ఆడాడు.

వెనక్కి తగ్గి.. సెంచరీలు బాది..
బీసీసీఐ వేటు వేయడంతో తన తప్పు తెలుసుకున్న ఇషాన్ కిషన్.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశాడు.ఇండియా సి తరఫున 126 బంతుల్లోనే 111 పరుగులు సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్ జట్టు తరఫున మరో శతకం బాదాడు. విజయ్ హాజారే ట్రోఫీలోనూ సెంచరీ చేశాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ మెరుపు శతకం బాదేశాడు. అలా వరుసగా సెంచరీలు బాదుతూ.. జాతీయ జట్టు సెలక్టర్లకు తానున్నానని సందేశం పంపుతున్నాడు. క్రికెట్ అభిమానులు కూడా అతడిని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కాబట్టి అతడు క్రమశిక్షణగా ఉంటూ, ఇదే ఫామ్ ను కొనసాగిస్తే మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇషాన్ కిషన్ ఐపీఎల్ జర్నీ..
2016లో గుజరాత్ లయన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత 2018లో ముంబయి ఇండియన్స్ లోకి వెళ్లాడు. కానీ 2018, 2019లో నిరాశపరిచాడు. అయితే 2020 నుంచి 2024 వరకు జట్టులో కీలకంగా మారాడు. పలుసార్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గత సీజన్ లో అతడిని రిలీజ్ చేసింది ముంబయి. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్.. ఇషాన్ కిషన్ ను రూ.11.20 కోట్లకు దక్కించుకుంది.