అంకితభావానికి మారు పేరు ఏదైనా ఉందంటే.. అది రాహుల్ ద్రవిడ్! ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ అతడు నిరూపిస్తూనే ఉన్నాడు. ఆటగాడిగా ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన అతడు.. ఇప్పుడు కోచ్గానూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తూ క్రికెట్ అభిమానుల మనుసును దోచుకుంటున్నాడు.
అన్యాయం జరగకూడదని..
రాహుల్ ద్రవిడ్.. ఆటగాడిగా, కెప్టెన్గా, హెడ్ కోచ్గా సేవలు అందించి ఇండియన్ క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడతడు గత కొద్ది రోజులుగా కాలికి గాయం అవ్వడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అతడి కాలికి ఫ్రాక్చర్ అయింది. అయినా కూడా అతడు ఏమాత్రం లెక్కచేయకుండా.. మైదానంలో దిగి ఆటగాళ్లకు శిక్షణ అందిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్గా ఉన్న ద్రవిడ్.. తన జట్టుకు తన వల్ల అన్యాయం జరగకూడదని.. కాలికి కట్టు కట్టుకుని వచ్చీ మరి సాధన చేయిస్తున్నాడు.

మొన్న ఊత కర్రలతో.. ఇప్పుడు వీల్చెయిర్లో..
ఇటీవలే ఊత కర్రల సాయంతో జట్టు శిక్షణ శిబిరానికి హాజరయ్యాడు. గాయమైన కాలికి ప్రత్యేకమైన బూట్ వేసుకుని కర్రల సాయంతో నడిచాడు. ఆటపట్ల తనకున్న నిబద్ధతతో ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. తాజాగా కూడా ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యచ్ కు.. గాయపడిన కాలితోనే హాజరయ్యాడు. ఎలక్ట్రిక్ వీల్ చెయిర్ లో కూర్చొని మైదానానికి వచ్చాడు. తన ఆటగాళ్లకు మెలకువలు నేర్పుతూ కనిపించాడు. అలానే గాయాన్ని లెక్కచేయకుండా ప్లేయర్స్ తో చిరునవ్వులు చిందిస్తూ గడిపాడు. దీంతో క్రికెట్పై అతడికున్న ప్రేమ, నిబద్ధత, అంకితభావాన్ని అభిమానులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఆటపై తనకున్న అంకితభావాన్ని ద్రవిడ్ మరోసారి నిరూపించాడని కామెంట్లు చేస్తున్నారు.