
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య దుబాయ్ వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరిగే పోరులో విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ కోవిడ్-19 వారియర్స్కు ఘనమైన నివాళులు అర్పించడానికి సిద్ధమైంది. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఈరోజు మ్యాచులో ఆర్సీబీ ఆటగాళ్లు 'మై కోవిడ్ హీరోస్' అని ముద్రించిన జెర్సీలతో బరిలోకి దిగుతున్నారు. ఇక ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్లు ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోవిడ్-19 వారియర్స్కు ఘనమైన నివాళులు అర్పించడానికి సిద్దమైన ఈ ప్లేయర్లు తమ సోషల్ మీడియాలో అకౌంట్ల పేర్లను మార్చేసుకున్నారు. 'పారితోష్ పంత్' అంటూ డివిలియర్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మార్చుకోగా.. 'సిమ్రాన్జీత్ సింగ్' అంటూ కోహ్లీ తన ట్వీటర్ అకౌంట్ పేరును మార్చుకున్నాడు.
విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ డీపీలో కూడా సిమ్రాన్జీత్ సింగ్ పేరుతో కనిపిస్తున్నాడు. పారితోష్ పంత్-17 జెర్సీతో డివిలియర్స్, సిమ్రాన్జీత్ సింగ్-18 జెర్సీతో కోహ్లీలు కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను సోషల్ మీడియా హ్యాండిల్ పేరును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో ఏబీడీ కారణం చెప్పాడు. పారితోష్ పంత్ అనే రెస్టారెంట్ ఓనర్ ప్రాజెక్ట్ ఫీడింగ్ పేరుతో ఎంతోమంది పేద ప్రజలకు లాక్డౌన్ సమయంలో ఆహారాన్ని అందించాడన్నాడని, అందుకే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరును మార్చుకున్నాడన్నాడు.
'సిమ్రాన్జీత్ సింగ్ అనే వ్యక్తికి వినికిడి లోపం ఉంది. కాని అది ఇతరులకు సహాయం చేయకుండా అతన్ని ఆపలేదు. కరోనాతో బాధపడుతున్న పేద ప్రజల కోసం విరాళాలు సేకరించడానికి అతడు ముందుకు వచ్చాడు. ఇది చూసి వినికిడి లోపం ఉన్న చాలా మంది వ్యక్తులు అందులో భాగమయ్యారు. వారు నిస్వార్థంగా నిధులు విరాళంగా ఇచ్చారు. సిమ్రాన్జీత్ సింగ్ తన స్నేహితులతో కలిసి ప్రజలకు సహాయం చేయడానికి రూ .98,000 విరాళాలు సేకరించారు' అని ఆర్సీబీ తెలిపింది. దీనిపై ట్వీటర్లో ఏబీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.