హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో చెలరేగింది. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ను నిర్దేశించినప్పటికీ- అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవున్న నేపథ్యంలో- ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం లాంఛనప్రాయమే.
గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్రైజర్స్తో తలపడిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్దేశించిన 186 పరుగులు భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఈజీగా కొట్టి అవతల పడేశారు. 19.2 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. నాలుగు భారీ సిక్సర్లు, డజను ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ విశ్వరూపం ముందు- సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్లో హెన్రిచ్ క్లాసెన్- 51 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో చేసిన 104 పరుగులు వెలవెలపోయాయి.
ఐపీఎల్లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య ఆరుకు చేరింది. ఓ బ్యాటర్ ఆరు సెంచరీలు చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి. ఇదివరకు వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్- ఈ అరుదైన రికార్డును సాధించాడు. తాజాగా దీన్ని సమం చేశాడు విరాట్ కోహ్లీ. గేల్-కోహ్లీ తరువాత అత్యధికంగా సెంచరీలు చేసిన జాబితాలో జోస్ బట్లర్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇప్పటివరకు జోస్ బట్లర్ ఖాతాలో అయిదు ఐపీఎల్ సెంచరీలు ఉన్నాయి. ఆరో సెంచరీని తృటిలో మిస్ అయ్యాడు. ఈ నెల 7వ తేదీన జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్పై జరిగిన మ్యాచ్లో సెంచరీకి చేరువ అయినప్పటికీ.. దాన్ని అందుకోలేకపోయాడు బట్లర్. 95 పరుగుల వద్ద భువనేశ్వర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఈ ముగ్గురి తరువాత ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, ఏబీ డివిలియర్స్, సంజు శాంసన్ ఉన్నారు. వార్నర్, వాట్సన్, కేఎల్ రాహుల్-4, ఏబీ, సంజు శాంసన్ మూడు చొప్పున సెంచరీలను సాధించారు. క్రిస్ గేల్, షేన్ వాట్సన్ క్రికెట్కు దూరమైన నేపథ్యంలో సెంచరీల సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం మిగిలిన వారికి ఉంది.