
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్లే ఆఫ్ నుంచి ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) నిష్క్రమించింది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్కు అర్హత సాధించగా.. తాజాగా నాలుగో స్థానంను కోల్కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. ముంబై నిర్ధేశించిన 236 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 65 పరుగులు చేయగానే.. రోహిత్ సేన అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా అయ్యాయి.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న ఈ మ్యాచులో విజయం సాధించడం ముంబైకి చాలా కీలకం. రోహిత్ సేన ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్కి చేరాలంటే భారీ విజయం అవసరం. గత రాత్రి కోల్కతా విజయం సాధించడంతో రోహిత్ సేన ప్లే ఆఫ్ ఆశలకు ఎసరొచ్చింది. ఇప్పుడు 171 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే కోల్కతాను వెనక్కినెట్టి ముంబై ముందడుగు వేసేది. అంటే ముంబై 235 పరుగులు చేసింది కాబట్టి.. సన్రైజర్స్ జట్టును 65 పరుగులకే కట్టడి చేయాలి. కానీ ఓపెనర్ జాసన్ రాయ్ చెలరేగడంతో ఎస్ఆర్హెచ్ ఆరో ఓవర్ మూడో బంతికే 64 పరుగులు చేసింది. దాంతో ముంబై ఆశలకు తెరపడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (84: 32 బంతుల్లో 11x4, 4x6) క్రీజులో ఉన్నంతసేపూ మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (18) క్రీజులో కుదురుకుంటున్న సమయంలో రషీద్ ఖాన్ వేసిన 5.3 బంతికి ఔట్ అయ్యాడు. వికెట్ పడినప్పటికీ ఇషాన్ దాటిగానే ఆడాడు. ఈ క్రమంలోనే ఇషాన్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అదే సమయంలో 7.2 ఓవర్లలోనే ముంబై స్కోరు వంద పరుగులు దాటింది. అయితే హార్డ్ హిట్టర్ల హర్దిక్ పాండ్యా (10), కీరన్ పొలార్డ్ (13) ఆకట్టుకోలేకపోయారు. త్వరగానే పెవిలియన్ చేరారు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఇషాన్ కిషన్ మాత్రం పరుగుల వరద పారించాడు. ఇషాన్ ఊపు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ అతడి జోరుకు కళ్లెం వేశాడు. మాలిక్ వేసిన పదో ఓవర్లో ఇషాన్ కీపర్ వృద్దిమాన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (82: 40 బంతుల్లో 13x4, 3x6) ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సూర్య కూడా సిక్సులు, ఫోర్లతో అలరించాడు. ఈ క్రమంలోనే అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో చివరి ఓవర్లో ఔట్ అయ్యాడు. జేమ్స్ నీషమ్ (0), కృనాల్ పాండ్యా (9), నాథన్ కౌల్టర్ నైల్ (3), పియూష్ చావ్లా (0) రాణించలేకపోయారు. చివర్లో బుమ్రా (5), బౌల్ట్ (0) నాటౌట్గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు.