ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అనంతరం మ్యాచ్ ఫలితంపై అందరూ ఓ అంచనాకు వచ్చారు. హైదరాబాద్దే గెలుపు అని భావించారంతా.
ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్రైజర్స్ నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. గత ఆర్సీబీ 263 పరుగుల రికార్డును బ్రేక్ చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్రమ్ (42*; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80*; 34 బంతుల్లో) ఊచకోతతో ఇన్నింగ్స్ ముగించాడు.

టీ20లో 278 పరుగుల లక్ష్యాన్ని సాధించాలంటే ఏ జట్టుకైనా అసాధ్యమే. కానీ ముంబై గొప్పగా ప్రయత్నించింది. 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఐపీఎల్ ఛేదనలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. హైదరాబాద్ అభిమానులు భయపడేలా తిలక్ వర్మ (64; 34 బంతుల్లో) బ్యాటింగ్ చేశాడు.
టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) కూడా గొప్పగానే ఆడారు.
అయితే తిలక్ వర్మ క్రీజులో ఉన్నంతసేపు ముంబై రికార్డు విజయాన్ని అందుకునేలా కనిపించింది. తిలక్ ధాటికి ముంబై 14 ఓవర్లలో 182/3 స్కోరు చేసింది. తిలక్ జోరు చూస్తుంటే ముంబైని గెలిపించేలా ఉన్నాడు. కానీ బ్రేక్ తర్వాత బంతి అందుకున్న కమిన్స్ స్లో బౌన్సర్తో తిలక్ను ఔట్ చేశాడు. తిలక్ ఔటవ్వడంతో సన్రైజర్స్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎస్ఆర్హెచ్ సీఈవో కావ్య మారన్ కూడా ఓ భారం తీరిపోయిందన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. తిలక్ మైదానాన్ని వీడుతుంటే దండం పెడుతూ ఊపిరిపీల్చుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు. విజయానంతరం సంతోషంతో కావ్య చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.