ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇరు జట్లు ఈ సీజన్ను ఓటమితోనే మొదలుపెట్టాయి. అయితే రెండు జట్లూ స్వల్ప తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయాన్ని చవిచూశాయి. కేకేఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నాలుగు పరుగులు, గుజరాత్ మ్యాచ్లో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాయి.
అయితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సన్రైజర్స్ మ్యాచ్ ఎంతో స్పెషల్ కానుంది. ఈ పోరుతో రోహిత్ రికార్డు సృష్టించనున్నాడు. ముంబై ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్ల మార్క్ను అందుకోనున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 244 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ ముంబై తరఫున 199 మ్యాచ్లు ఆడాడు.

ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లి, సీఎస్కే తరఫున ధోనీ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో రోహిత్ శర్మ చేరనున్నాడు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్లో 150 వికెట్ల మార్క్ను అందుకోవడానికి బుమ్రా రెండు వికెట్లు దూరంలో ఉన్నాడు.
ఐపీఎల్లో 150 వికెట్ల మార్క్ను అందుకున్న భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ మాత్రమే. ఈ జాబితాలో భారత స్పిన్నర్లు ఉన్నారు కానీ, పేసర్ భువీ మినహా ఎవరూ లేరు. సన్రైజర్స్ మ్యాచ్లో భువీతో చేరాలని బుమ్రా భావిస్తున్నాడు. కాగా, ఇప్పటివరకు ఓవరాల్గా 10 బౌలర్లు 150 వికెట్లు సాధించారు. చాహల్ (188), బ్రావో (183), పీయూష్ చావ్లా (180), అమిత్ మిశ్రా (173), రవిచంద్రన్ అశ్విన్ (172), లసిత్ మలింగ (170), భువనేశ్వర్ (170), సునీల్ నరైన్ ( 164),రవీంద్ర జడేజా (152), హర్భజన్ సింగ్ (150) వికెట్లు సాధించారు.