
ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్.. రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ ఇంకా తేలాల్సి ఉంది. చివరి నిమిషంలో సన్రైజర్స్ హైదరాబాద్ అందుకున్న గెలుపు.. ఈ టోర్నమెంట్ను మరింత ఆసక్తికరంగా మార్చివేసింది. సన్రైజర్స్ ప్లే ఆఫ్ రేసులో ఇంకా మిగిలి ఉంది. చివరి నాలుగు మ్యాచ్లను సన్రైజర్స్ గెలుచుకోగలిగితే- దర్జాగా ప్లేఆఫ్లోకి ఎంట్రీ ఇస్తుంది.
ముంబై ఇండియన్స్ కూడా ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. తన హ్యాట్రిక్ పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయిన టైటిట్ హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్.. మంగళవారం రాత్రి అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్ టీమ్ను 135 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఛేజింగ్కు దిగిన రోహిత్ సేన.. ఒక ఓవర్ ఇంకా మిగిలి ఉండగానే నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ లీగ్ దశలో చివరి మ్యాచ్లో ఎదురుపడనున్నాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 8వ తేదీన షెడ్యూల్ చేశారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. అదే రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో చిట్టచివరి లీగ్ మ్యాచ్ను ఆడబోతోన్నాయి. ఇది కూడా అక్టోబర్ 8వ తేదీ నాడే సాయంత్రం 7:30 గంటలకే మొదలవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ను జరుగుతుంది.
అంటే ఒకే రోజు రెండు ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ఒకే సమయానికి మొదలవుతాయన్నమాట. సాధారణంగా- రెండు ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంటే.. వాటి సమయం, షెడ్యూల్ ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. మధ్యాహ్నం ఒక మ్యాచ్, సాయంత్రం ఇంకో మ్యాచ్ను ఉండేలా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ దాన్ని షెడ్యూల్ చేస్తుంది. ఇప్పటిదాకా జరిగిన, ఇక ముందు జరిగబోయే మ్యాచ్ల షెడ్యూల్ కూడా ఇలాగే ఉంటుంది.
ఈ ఐపీఎల్ సీజన్లో చివరి రెండు లీగ్ మ్యాచ్లు మాత్రం ఒకేరోజు.. ఒకే సమయానికి మొదలయ్యేలా బీసీసీఐ సవరణలు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్- ఇదివరకు ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే అక్టోబర్ 8వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. తాజాగా దాన్ని కాస్త వెనక్కి జరిపింది. 7:30 గంటలకు నిర్వహించేలా షెడ్యూల్లో సవరణలు చేసింది. ఒకేరోజు.. ఒకే సమయానికి రెండు మ్యాచ్లను చూడాల్సి రావడం.. అభిమానులకు కొత్త.
ఈ తరహా పరిస్థితి ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ ఫైట్.. ఒకేసారి ఉంటుంది. ఏ మ్యాచ్ చూడాలో తేల్చుకోవాల్సింది అభిమానులే. ఈ సవరణలు చేయడానికి కారణం.. 2023-2027 మధ్య జరిగే ఐపీఎల్ టోర్నమెంట్కు సంబంధించిన మీడియా హక్కుల టెండర్లు, రెండు కొత్త ఐపీఎల్ జట్ల ప్రకటన కోసం బీసీసీఐ ఓ కీలక సమావేశాన్ని అదే రోజు నిర్వహించాల్సి ఉందని, అందుకే ఈ మార్పులు చేసినట్లు చెబుతున్నారు.