ఉప్పల్ వేదికగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించింది. మ్యాచ్లో తొలి బంతి నుంచి ఆఖరి వరకు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో కొత్త చరిత్ర లిఖించబడింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు, అత్యధిక ఛేజింగ్ స్కోరు, అత్యధిక సిక్సర్ల సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతేగాక టీ20 క్రికెట్లోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఈ పోరు నిలిచింది. ఇక SRH తరఫున కూడా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన సన్రైజర్స్ బ్యాటర్గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు.

అయితే అభిషేక్ కంటే కొన్నినిమిషాల ముందు ఈ రికార్డును ట్రావిస్ హెడ్ సాధించాడు. 18 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ బాదాడు. కాసేపటికే అభిషేక్ 16 బంతుల్లో అర్ధశతకం సాధించి రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శనకు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా కారణమని అభిషేక్ చెప్పాడు. లారా చెప్పిన మాటలు తనకి ఎంతో ఉపయోగపడ్డాయని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న అనంతరం ఈ 23 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ పేర్కొన్నాడు.
''దేశవాళీ క్రికెట్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక జట్టు నుంచి మాకు ఒకే సందేశం ఉంటుంది.. 'వెళ్లి, నీ ఆట నువ్వు ఆడు' అని. ఎటాకింగ్ గేమ్ ఆడటమే నా ప్లాన్. ఇక ట్రావిస్ హెడ్తో బ్యాటింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించా. అతను నా ఫేవరేట్ బ్యాటర్లలో ఒకరు. హెడ్ను నేను ఆరాధిస్తా. నా జోన్లో బంతి వస్తే వదలవద్దు అని చెప్పాడు''
''నాకు అవకాశాలు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తున్నాఅనేది పెద్ద విషయం కాదు. గత రాత్రి బ్రియాన్ లారాతో మాట్లాడే అవకాశం వచ్చింది. అది నాకు ఎంతో గొప్పగా ఉపయోగపడింది. ఇక నేను బ్యాటింగ్ కంటే బౌలింగే ఎక్కువ సాధన చేస్తున్నా. బంతితోనూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నా'' అని అభిషేక్ వర్మ తెలిపాడు.
523 పరుగులు నమోదైన ఈ మ్యాచ్లో అంతిమంగా ముంబైపై హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో), అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో), మార్క్రమ్ (42*; 28 బంతుల్లో), క్లాసెన్ (80*; 34 బంతుల్లో) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు.