SRH vs LSG: ఈ సారి ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరేట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుడుతోంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఇక ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్తో రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే లక్నోతో మ్యాచ్ అనగానే గత సీజన్ లో జరిగిన ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ గుర్తుకు వస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అభిమానులు ఒక్కసారిగా ఫ్లాష్బ్యాక్ లోకి వెళ్తారు. ఐపీఎల్ 2024లో ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నోపై సన్ రైజర్స్ విధ్వంసం సృష్టించింది. భారీ లక్ష్యాన్ని ఏకంగా మొదటి 10 ఓవర్లలోనే ఛేదించి సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు తమ సత్తాను చూపించారు.
ఐపీఎల్ 2024లో మే8 ఈ రెండు జట్ల మధ్య 57వ మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కాగా.. మిడిలార్డర్ రాణించడంతో ఈ స్కోరు చేయగలిగింది. లక్నో బ్యాటర్లు నికోలస్ పూరన్(48), ఆయుష్ బదోనీ(55) రాణించారు.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వీరంగం సృష్టించింది. ఆ లక్ష్యాన్ని సన్ రైజర్స్ జట్టు కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్ పడకుండా ఛేదించింది. అంటే పది ఓవర్లలోపే 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయారు. పవర్ ప్లేలోనే 125 పరుగులతో రికార్డు సృష్టించారు. అభిషేక్ శర్మ 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 75 పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో గతాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ అది రిపీట్ అవుతుందా అంటూ చర్చించుకుంటున్నారు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసి తన రికార్డును బ్రేక్ చేసేందుకు సన్ రైజర్స్ ప్రయత్నించింది. కానీ కొంచెంలో అది మిస్ అయ్యింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో 300 మార్కును అందుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.