ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ బంబేలెత్తించాడు. ఈ మ్యాచులో తన 4 ఓవర్ల స్పెల్లో మొత్తం 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తద్వారా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. పర్పుల్ క్యాప్ హోల్డ్ గా కొనసాగుతున్నాడు.
ఆరంభంలోనే షాక్..
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్రైజర్స్ ఆరంభంలోనే షాకిచ్చాడు శార్దూల్ ఠాకూర్. మూడో ఓవర్లో తొలి రెండు బంతులకు అభిషేక్ శర్మ (6 పరుగులు), ఇషాన్ కిషన్ (0) ను వరుసగా ఔట్ చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు 2.2 ఓవర్లలో 15 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. ఇక చివర్లో అభినవ్ మనోహర్ (2), మహ్మద్ షమీను కూడా పెవిలియన్ పంపాడు. అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులోనూ శార్దూల్ రెండు ఓవర్లలో శార్దూల్ 2 వికెట్లు తీశాడు.మొత్తంగా ఈ సీజన్ తో తాను ఆడిన రెండు మ్యాచుల్లో కలిపి 6 వికెట్ తీశాడు శార్దూల్.

అప్పుడు అన్ సోల్డ్..
వాస్తవానికి ఐపీఎల్ 2025 మెగా వేలంలో శార్దూల్ ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్ సోల్డ్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మెహ్సిన్ ఖాన్ గాయపడటం వల్ల అతడు లక్నోకి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దీంతో అతడిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.
అదే మా ప్లాన్..
"క్రికెట్లో ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి అని నేను భావిస్తాను. ఆ రోజు నాకు బ్యాడ్ డే. వేలంలో నన్నెవరూ ఎంపిక చేయలేదు. అయితే, తమ బౌలర్లకు గాయాలు కావడంతో LSG నన్ను మొదటగా సంప్రదించింది. ఇలాంటివి జరుగుతుంటాయి. జహీర్ ఖాన్ వంటి దిగ్గజం ఉండగా, దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. క్రికెట్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. నాకు గెలుపే ముఖ్యం, వికెట్లు లేదా పరుగుల గణాంకాలను చూసుకోవడం నాకు ముఖ్యమేమీ కాదు. నేను మ్యాచ్పై ప్రభావం చూపిస్తూ, విజయాన్ని అందించాలనుకుంటాను. బ్యాటర్లు బౌలర్లపై దాడి చేస్తుంటే, బౌలర్లు కూడా అదే రీతిలో ఎదురు దాడి చేయకూడదు? ఇదే మా ప్రణాళిక. దాన్ని సన్రైజర్స్పై అమలు చేశాం. వారు ఫ్లాట్ పిచ్ లపై భారీ స్కోర్లు సాధిస్తున్నారు. కానీ ఈ రోజు మ్యాచ్ ప్రారంభంలోనే పరిస్థితులు మాకే అనుకూలంగా మారాయి." అని శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నాడు.