SRH VS LSG: ఐపీఎల్ 2025 సీజన్ ను విజయంతో ఘనంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. దాన్ని కొనసాగించలేకపోయింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తమ రెండో మ్యాచులో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఓటమిని అందుకుంది. దాదాపు 300కుపైగా పరుగులు చేస్తుందని భావిస్తే.. కేవలం 190 పరుగులే చేసి, 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు పక్కా వ్యూహంతో అద్భుతంగా బౌలింగ్ చేసి సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ 4/34తో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత బ్యాటర్లు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి లక్ష్యాన్ని ఛేదించారు.
ఆ ఇద్దరే ఉదేశారు..
మొదట దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి అందుకున్న లఖ్నవూ జట్టు.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఎంతో ప్లాన్డ్ గా ఆడి విజయం సాధించింది. మొత్తంగా ఈ మ్యాచులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ సీజన్ లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ఓపెనర్ మిచెల్ మార్ష్ (52; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగి ఆడారు. దీంతో 191 పరుగుల లక్ష్యం కరిగిపోయింది.

బౌలర్ల దెబ్బకు విలవిల...
అంతకుముందు సన్ రైజర్స్ బ్యాటర్లలో టాప్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్ ( 28 బంతుల్ 47;లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్లో అనికేత్ వర్మ (36; 13 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు. నితీశ్ రెడ్డి (32; 28 బంతుల్లో), హెన్రిచ్ క్లాసెన్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. పాట్ కమిన్స్ (18; 4 బంతుల్లో) కాస్త దూకుడుగా ఆడాడు. మిగతా వారు విఫలమయ్యారు. బౌలర్లు కూడా అంతగా రాణించలేదు.
అలా చేయాల్సింది.. అదే ఓటమికి కారణం...
మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ జట్టు ఓటమికి గల కారణాలను తెలిపాడు. ప్రత్యర్ధి జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని కొనియాడాడు. "గత మ్యాచుకు ఇప్పటికీ వికెట్ కాస్త భిన్నంగా ఉంది. కానీ మేము పరుగులు ఇంకాస్త వేగంగా చేయాల్సింది. వారు నిజంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయినప్పటికీ, వికెట్ ఇంకా మంచిగానే ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్లలో అది ఒకటైతే, ఇది రెండో ఉత్తమమైన వికెట్. బంతికి కాస్త గ్రిప్ దొరికినప్పటికీ, బ్యాటింగ్కు అనుకూలంగానే అనిపించింది. ప్రతి మ్యాచ్ కొత్తగానే ఉంటుంది. వారు తమ వ్యూహాన్ని పక్కా ప్రణాళికలో అమలు చేసి బౌలింగ్ వేశారు. 190 పరుగులు సాధించడం బలమైన స్కోరే. సాధారణంగా, ఒక బ్యాటర్ ఎప్పుడూ పూర్తిగా ఇన్నింగ్స్ను నడిపించాలి. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ అలా చేశాడు. కానీ ఈసారి, వారు అద్భుతమైన బౌలింగ్ చేసి మాకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. మా జట్టులో 8 మంది బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి వాళ్లు ఎప్పుడైనా ఎదురుదాడికి సిద్ధంగా ఉండి, మ్యాచ్పై ప్రభావం చూపించడం కీలకం. కొన్ని అంశాల్లో మెరుగుదల అవసరం, అదే విజయాన్ని తెస్తుంది. టోర్నీలో ఇంకా చాలా మ్యాచులు ఉన్నాయి. కాబట్టి మేం రాణించడానికి మరో అవకాశం దొరుకుతుంది. అందుకే, ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగడం ముఖ్యం." అని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.