SRH VS LSG: ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచులో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తుస్సుమంది. 300 పైగా పరుగులు సాధిస్తుందని అనుకుంటే.. కనీసం 200 మార్క్ కూడా టచ్ చేయలేకపోయింది. ఇక ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించి అదరగొట్టింది. మొదట శార్దూల్ ఠాకూర్ బంతితో మాయ చేయగా, తర్వాత నికోలస్ పూరన్, మార్ష్ బ్యాట్ తో దంచికొట్టారు. దీంతో లక్నో 191 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.

అదే బాగా కలిసొచ్చింది..
మ్యాచ్ అనంతరం నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. "ఇది(ఆరెంజ్ క్యాప్) కాస్త పెద్దగా అనిపిస్తున్నా, ధరించడం ఆనందంగా ఉంది. నేను సిక్సర్లు కొట్టాలని ముందుగా అనుకోను, కానీ మంచి పొజిషన్లో నిలబడి బంతిని సమయానికి బలంగా బాదేందుకు ప్రయత్నిస్తాను. ప్రత్యర్థి బౌలర్కు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు నా నైపుణ్యాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాను. వికెట్ అద్భుతంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన గత మ్యాచ్లను చూస్తే, ప్రతిసారి పెద్ద స్కోర్లు నమోదవుతున్నాయి. టాస్ గెలవడం మాకు బాగా కలిసొచ్చింది. పవర్ప్లేలో వికెట్లు కోల్పోకుండా నిలబడి ఆడితే, దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడూ నా బ్యాట్ స్పీడ్ను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా శ్రమించలేదు. దేవుడిచ్చిన సహజ ప్రతిభ అది. ఈ టోర్నమెంట్ లో ఇంకా చాలా మ్యాచులు ఉన్నాయి. మిచచెల్ మార్ష్ తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శించడం ఆనందంగా ఉంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ చాలా ముఖ్యమైనది. స్ట్రైక్ను మారుస్తూ, భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటూ, మా ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడమే మా లక్ష్యం." అని పేర్కొన్నాడు.