ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులోనూ సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ అటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో అదరగొట్టి విజయాన్ని అందుకుంది. సిరాజ్ (4/17) బౌలింగ్, వాషింగ్టన్ సుందర్ 190కు పైగా స్ట్రైక్ రేట్ (29 బంతుల్లోనే 49 పరుగులు) విజయంలో కీలకంగా వ్యవహరించాయి. అయితే ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సిమర్జీత్ సింగ్పై సన్రైజర్స్ అభిమానులు మండిపడుతున్నారు. ఓ రేంజులో ట్రోల్ చేస్తూ ఆటాడేసుకుంటున్నారు. అతడు వేసిన ఆ ఒక్క చెత్త ఓవర్ వల్లే మ్యాచ్ గమనం మారిపోయిందని అంటున్నారు.
ఒక్క ఓవర్తో అంతా చెడగొట్టేశాడు...
ఈ మ్యాచులో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన వాషింగ్టన్ సుందర్ అదరగొట్టేశాడు. ముఖ్యంగా అతడు ఆరో ఓవర్ లో వచ్చిన సిమర్జీత్ బౌలింగ్లోనే రెండేసి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ ఓవర్ లోని తన ప్రదర్శనతో మ్యాచ్ గమనాన్నే పూర్తిగా మార్చేశాడు. దీంతో ఈ మ్యాచులో ఒకే ఒక్క ఓవర్ వేసిన సిమర్జీత్ తన చెత్త బౌలింగ్ తో ఒక్క వికెట్ కూడా తీయకుండానే 20 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. అందుకే సిమర్జీత్ను సన్ రైజర్స్ అభిమానులు దారుణంగా తిడుతున్నారు. ఒక్క ఓవర్ తో మ్యాచ్ ను చెడ గొట్టేశాడని కామెంట్లు చేస్తున్నారు.

గబ్బా సీన్ రీక్రియేట్..
సుందర్ ఇన్నింగ్స్ లో ఓ సిక్స్.. 2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో గబ్బా ప్యాట్ కమిన్స్ సిక్స్ ను రీక్రియేట్ చేసిందని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. సిమర్ జిత్ బౌలింగ్ లో మెదటి రెండు బంతులను బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదిన సుందర్ ... ఆ తర్వాత నాలుగో బంతిని సిక్స్ గా మలిచాడు. ఇక లాస్ట్ బంతిని కూడా సిక్స్ కొట్టాడు. ఈ సిక్సే ఫేమస్ ప్యాట్ కమిన్స్ గబ్బా సిక్స్ ను గుర్తుచేసిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.