SRH VS GT: ఐపీఎల్ 2025ను ఘనంగా ఆరంభించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక తమ ఐదో మ్యాచును సొంతమైదానం ఉప్పల్ లో ఆడనుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఈ నేపథ్యంలో జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మోట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత మూడు మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తమ దూకుడు కొనసాగిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
ఆ ఇద్దరు తోపులు..
గత సీజన్ లో అద్భుతంగా ఆడిన విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ .. ఈ సీజన్ లో విఫలమవుతున్నారు. ఈ సీజన్ తొలి మ్యచులో హెడ్ 67 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత నుంచి హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేయలేదు. అభిషేక్ మొత్తంగా ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో 33 పరుగులే చేశాడు. అయితే వారికి మద్దతుగా నిలిచాడు సైమన్. వారిద్దరు మళ్లీ ఫామ్ లోకి వస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
"మైదానంలోకి దిగిన ప్రతి సారి ఒత్తిడి ఉంటుంది. గతంలో విజయం సాధించినప్పుడు అది ఉంది. ఇప్పుడు కొత్త గేమ్ లోనూ అది ఉంటుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుతం. వారికి మేమెప్పుడు అండగానే ఉంటాం. వారి దూకుడు కొనసాగిస్తారని మేం నమ్ముతున్నాం." అని సైమన్ చెప్పుకొచ్చాడు.

మమ్మల్ని అతడు ముందుకు తీసుకెళ్తాడు..
"మా ప్లాన్స్ ఒకేలా ఉంటాయి. హోం గ్రౌండ్ లో మేం బాగా విజయాలు సాధించాం. గత 8 మ్యాచుల్లో 6 గెలిచాం. గత రెండు మ్యాచుల్లోనే మాకు కలిసి రాలేదు. కానీ మేం పాజిటివ్ బ్రాండ్ తో క్రికెట్ ఆడతాం. మాపై మాకు నమ్మకం ఉంది. మాకు మంచి కెప్టెన్ ఉన్నాడు. మమ్మల్ని కచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు హైదరాబాద్లో మళ్లీ అడుగు పెట్టినప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్సే వస్తున్నాయని అనిపిస్తోంది." అని సైమన్ పేర్కొన్నాడు.