SRH VS DC: ఐపీఎల్ 2025లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచుకు ముందు సన్రైజర్స్ తీవ్ర ఆవేదనతో రాసిన ఓ లేఖ బయటకు వచ్చి చర్చనీయాంశమైంది. ఈ లేఖలో సన్రైజర్స్ ఫ్రాంఛైజీ.. హెచ్సీఏపై తీవ్ర ఆరోపణలు చేసింది. తమను హెచ్సీఏ దారుణంగా వేధిస్తోందని రాసి ఉంది. ఇలానే వేధిస్తూ ఉంటే.. హైదరాబాద్ నగరాన్నే తాము విడిచి వెళ్లిపోతామని సన్రైజర్స్ హెచ్చరించడం గమనార్హం.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?(SRH VS HCA)
సన్రైజర్స్ హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఉప్పల్ స్టేడియం. తెలుగు క్రికెట్ అభిమానులు ఆరాధించే ఫ్రాంఛైజీ. అయితే ఈ ఫ్రాంఛైజీ మ్యాచులు జరిగే హోం గ్రౌండ్(ఉప్పల్) నిర్వహణ బాధ్యతలను హెచ్సీఏ చూసుకుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా తమకు ఉచిత టికెట్లు మరిన్ని కావాలంటూ హెచ్సీఏ బెదిరింపులకు పాల్పడుతూ, బ్లాక్మెయిలింగ్ చేస్తుందని సన్రైజర్స్ హైదరాబాద్ ఆరోపించింది. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు పలుమార్లు బెదిరించారని పేర్కొంది. అందుకే తీవ్ర ఆందోళనతో లేఖ రాస్తున్నట్లు వెల్లడించింది.

తాళాలు వేసి బెదిరించారు...
"మేం గత 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పని చేస్తున్నాం. కానీ గత రెండేళ్లుగా హెచ్సీఏ నుంచి ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నాం. ఎన్నో ఏళ్లుగా మాకున్న ఒప్పందం ప్రకారమే హెచ్సీఏకు 3900 కాంప్లిమెంటరీ టికెట్లు, అందులోనే 50 కాంప్లిమెంటరీ టికెట్లు (ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్) టికెట్లు కేటాయిస్తున్నాం. కానీ ఈ ఏడాది ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే ఉన్నాయి, అదనంగా మరో బాక్స్లోనూ 20 టికెట్లు కేటాయించాలని అడిగింది. దీనిపై చర్చించి, సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పాం. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోకే వస్తుంది. దానికి అద్దె కూడా చెల్లిస్తున్నాం. కానీ గత మ్యాచులో ఎఫ్-3 బాక్సుకు లాక్ (తాళాలు) వేశారు. ఎక్స్ట్రాగా మరో 20 ఫ్రీ టికెట్లు కావాలని, లేదంటే బాక్స్ తెరవమంటూ చివరి నిమిషంలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది సరైన చర్య కాదు. ఇలా చేస్తే సమన్వయంతో పని చేయడం ఇబ్బందిగా మారుతుంది. అయినా వాళ్లు ఇలా బెదిరింపులకు పాల్పడం ఇదేం తొలిసారి కాదు. గత రెండే సీజన్లలో హెచ్సీఏ, మా సిబ్బందిని ఎన్నో సార్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మేం దీన్ని హెచ్సీఏ దృష్టికి కూడా తీసుకెళ్లాం.
అధ్యక్షుడు కూడా బెదిరింపులు...
ఈ ఏడాది హెచ్సీఏ అధ్యక్షుడు కూడా పలుసార్లు బెదిరించారు. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఈ స్టేడియంలో సన్రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో సంప్రదించి ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. మరో వేదికను చూసుకుంటాం. ఈ సమస్యను పరిష్కారించాలని కోరుకుంటున్నాం." అని సన్రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ లేఖలో రాసుకొచ్చారు. ఈ లేఖకు సంబంధించిన కథనాన్ని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సైట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. అది చూసి మా కథనం రాయబడింది. కాబట్టి ఇందులో నిజనిజాలు తెలియాలంటే అధికార ప్రకటనలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.