SRH VS DC: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును విలవిలలాడేలా చేశాడు మిచెల్ స్టార్క్. తన పాంచ్ పటాఖాతో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. 3.4 ఓవర్లలో 5 వికెట్లు తీసి 35 పరుగులే సమర్ఫించుకున్నాడు. తద్వారా ఈ ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు మిచెల్ స్టార్క్. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ ను దెబ్బ కొట్టడానికి తమ జట్టు రచించిన వ్యూహాన్ని చెప్పాడు.
రికార్డు ఇదే..
ఐపీఎల్ చరిత్రలో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్ గా రికార్డుకెక్కాడు మిచెల్ స్టార్క్. అలానే దిల్లీ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఓవర్సీస్ ఆటగాడిగానూ నిలిచాడు. ఇకపోతే గతంలో దిల్లీ క్యాపిటల్స్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 5/17. 2008లో డెక్కన్ ఛార్జర్స్ పై అమిత్ మిశ్రా దీన్ని నమోదు చేశాడు.

సన్స్రైజర్స్పై అలా చేయాలని ముందే అనుకున్నాం..
మ్యాచ్ అనంతరం స్టార్క్ మాట్లాడుతూ.. "సన్రైజర్స్ ఎంతటి శక్తివంతమైన జట్టు అనేది మాకు తెలుసు. అందుకే పاవర్ప్లేలో వికెట్లు తీయడం కీలకం అని ముందే అర్థమైంది. అందుకే ముందు దాన్నే టార్గెట్ చేశాం. మొత్తంగా, ఈ ఇన్నింగ్స్లో మేం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాం. కొత్త ఫ్రాంఛైజీలో రావడం చాలా మంచి అనుభూతి కలిగిస్తోంది. ఇది మా రెండో మ్యాచ్ మాత్రమే, కానీ అప్పుడే జట్టులోని ఆటగాళ్లతో కలిసిపోవడం, కొత్త వారితో పరిచయం అవ్వడం చాలా బాగుంది. నా వయసు 35 ఏళ్లు. నేను యువకుడిని కాదు. కానీ ఇంకా నాలో కాస్త ఆట మిగిలే ఉందని ఆశిస్తున్నాను. టి20ల్లో హెడ్ను ఆరు సార్లు ఔట్ చేయడం వల్లేమో అతడు ఇప్పుడు మొదటి బంతిని ఎదుర్కోవడం లేదు అనుకుంటా. ఏదేమైనా ఈ 15 ఏళ్లలో నేను ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు సీనియర్ ఆటగాడిగా యువ ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం ఉంది, నాకు చేతనైనంత వరకు వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా నా ఆటను ఆస్వాదిస్తున్నాను. క్రికెట్లో పోటీ వాతావరణాన్ని ప్రేమిస్తున్నాను. అందుకే ఇప్పటికీ ఆడుతున్నాను." అని చెప్పుకొచ్చాడు.