
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా షార్జాలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరోసారి తేలిపోయింది. సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టు ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (44) టాప్ స్కోరర్గా నిలిచాడు. 46 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సులు సాయంతో 44 పరుగులు చేశాడు. ఓపెనర్ జేసన్ రాయ్ (2), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11) పూర్తిగా నిరాశపరిచారు. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్ 3, డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీసుకోగా.. శార్ధూల్ ఠాకూర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ జేసన్ రాయ్ (2) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దాంతో తక్కువ స్కోరుకే సన్రైజర్స్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వృద్ధిమాన్ సాహా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ధాటిగా మాత్రం ఆడలేకపోయాడు. ఆపై ప్రియం గార్గ్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో సన్రైజర్స్కు మరో భారీ షాక్ తగిలింది.
ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా కూడా హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ (18), అబ్దుల్ సమద్ (18) నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే జోష్ హేజిల్ వుడ్ వేసిన 17వ ఓవర్లో ఇద్దరూ ఔటవ్వడంతో హైదరాబాద్ జట్టుకి గట్టి షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ జేసన్ హోల్డర్ (5) నిరాశ పరిచాడు. చివర్లో బ్యాటింగ్ వచ్చిన రషీద్ ఖాన్ (17), భువనేశ్వర్ కుమార్ (2) పరుగులతో నాటౌట్గా నిలిచారు. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్ 3, బ్రావో 2 వికెట్లు తీసుకోగా.. శార్ధూల్ ఠాకూర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నో బాల్కు ఔట్ అయ్యాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతికి సాహా ఔట్ అయ్యాడు. ఠాకూర్ మూడో బంతిని షార్ట్ పిచ్ బంతిగా వేయగా.. సాహా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకున్నాడు. చెన్నై సంబరాల్లో మునిగిపోగా.. అంపైర్ నో బాల్ అంటూ షాక్ ఇచ్చాడు. అలా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సాహా.. మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. అప్పటికి సాహా 32 బంతుల్లో 33 రన్స్ చేశాడు. ఆపై మరో మూడు ఓవర్ల పాటు క్రీజుల్ ఉన్నా.. ఫలితం లేకుండా పోయింది. రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్ మూడో బంతికి కీపర్ ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో 44 రన్స్ చేశాడు.