ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సొంతమైదానంలో ఉప్పల్ వేదికగా రేపు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉండాలంటే సన్రైజర్స్ తప్పక విజయం సాధించాల్సిందే. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఆరింట్లో గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
అయితే ఈ సీజన్ ఆరంభంతో పోలిస్తే సన్రైజర్స్ ప్రదర్శనలో దారుణమైన మార్పు వచ్చింది. మొదటి ఆరు మ్యాచ్ల్లో సన్రైజర్స్ అయిదు విజయాలతో హోరెత్తించింది. ఐపీఎల్లో రికార్డులు తిరగరాస్తూ ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించింది. కానీ చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. అది కూడా రాజస్థాన్ రాయల్స్పై ఒక్క పరుగు తేడాతో నెగ్గి ఊపిరిపీల్చుకుంది.

మరోవైపు ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో మిగిలిన మూడు మ్యాచ్లు ఎస్ఆర్హెచ్కు ఎంతో కీలకం కానున్నాయి. కేకేఆర్, ఆర్ఆర్ తదుపరి దశకు చేరడం దాదాపు ఖాయమైంది. మిగిలిన రెండు స్థానాల కోసమే ఇప్పుడు పోటీ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్తో హైదరాబాద్ 12 పాయింట్లతో సమంగానే సాధించింది. కానీ నెట్రన్రేటు నెగటివ్లో ఉండటంతో నాలుగో స్థానంలో నిలిచింది. రేపు లక్నోపై విజయం సాధించకపోతే సన్రైజర్స్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్తుంది.
ఈ నేపథ్యంలో లక్నోపై తప్పక గెలవాలని ఎస్ఆర్హెచ్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. మార్క్రమ్ స్థానంలో జేన్సన్ను తుదిజట్టులోకి తీసుకు వచ్చిన గత వ్యూహం విఫలమైంది. ఆల్రౌండర్గా జేన్సన్ సత్తాచాటుతాడని భావిస్తే బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో నిరాశపరిచాడు. మరోవైపు మార్క్రమ్ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. కీలక భాగస్వామ్యాలు లేక హైదరాబాద్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అందుకే మార్క్రమ్ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చి గెలుపుబాట పట్టాలని భావిస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్.