
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రతరం అవుతుంది. కరోనా సెకండ్ వేవ్తో భారత్ అల్లాడిపోతోంది. దేశం ఆంతటా ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్ లభించక కరోనా బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి వీలైనంతలో వాళ్లు ముందుకొచ్చి సాయం అందిస్తున్నారు. ప్రజలు, అభిమానులకు ఆపద ఎప్పుడు ఎదురైనా.. ముందుండే క్రికెటర్లు తమవంతు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ శ్రీవత్స్ గోస్వామి పెద్ద మనసు చాటుకున్నాడు.
కరోనా మహమ్మారి కట్టడికై భారత్ సాగిస్తున్న పోరులో భాగంగా 31 ఏళ్ల శ్రీవత్స్ గోస్వామి తన వంతు సాయం చేశాడు. దేశంలో ఆక్సిజన్ కొరతతో క్రోనా బాధితులు అల్లాడుతున్న సమయంలో.. ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని 'డొనాటేకర్ట్' అనే చారిటి ఆర్గనైజేషన్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అత్యవసర సమయంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపింది.
'అత్యవసర సమయంలో ఆక్సిజన్ సరఫరాను అందించడానికి మీరు చేసిన సాయంకు ధన్యవాదాలు' అని డొనాటేకర్ట్ ట్వీట్ చేసింది. ఇందుకు శ్రీవత్స్ గోస్వామి స్పందించాడు. కష్ట సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడాలని, వీలైనంత మేర సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. తన దేశానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తొలి స్వదేశీ క్రికెటర్గా శ్రీవత్స్ నిలిచాడు. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'సూపర్ శ్రీవత్స్', 'ధన్యవాదాలు భాయ్', 'గొప్ప మనసు మీది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన శ్రీవత్స్.. ఐపీఎల్ 2021లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2008 అండర్-19 వరల్డ్కప్ భారత జట్టులో భాగమైన అతడు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2021లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లను భారత పీఎం కేర్స్ ఫండ్కు అందజేసిన విషయం తెలిసిందే. ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ సైతం ఒక బిట్ కాయిన్ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. క్రికెటర్లే కాకుండా సినీ ప్రముఖులు కూడా తన వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరు విరాళాలు అందజేశారు.