ఏడాదిన్నార క్రితం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి, జాతీయ జట్టుకు దూరమై, విమర్శలను ఎదుర్కొన్న ఇషాన్ కిషాన్.. అప్పటి నుంచి వరుస శతకాలు బాదుతూ జాతీయ జట్టు సెలక్టర్లకు గట్టి సందేశం పంపుతూనే ఉన్నాడు. కానీ అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అయినా కూడా అతడు, తన ప్రయత్నాన్ని ఆపలేదు. కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా ఇప్పుడు ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో మెరుపు శతకం బాది క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు మరోసారి సెలక్టర్లకు గట్టి సందేశం పంపాడు.
సొంత అకాడమీలో..
అయితే ఇషాన్ కిషాన్ జర్నీ మొత్తాన్ని గమనిస్తే.. అతడు జాతీయ జట్టులో స్థానం కోసం ఎంతలా ప్రయత్నిస్తున్నాడో, శ్రమిస్తున్నాడో అర్థమవుతోంది. బీసీసీఐ, నేషనల్ టీమ్ కు దూరంగా తనను పక్కన పడేస్తే.. ఇషాన్ కిషన్ అక్కడితో ఆగిపోలేదు. తనలో ఉన్న కసిని అంతా పోగుచేసి, సొంతంగా సాధన మొదలుపెట్టాడు.

గతంలో ముంబయి ఇండియన్స్ గ్రౌండ్ ఘన్సోలీలో సాధన చేసే అతడు.. ఆ తర్వాత పట్నాలో స్వయంగా తన సొంత అకాడమీని స్థాపించుకుని అందులోనే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడే తనని తాను మరింత రాటుదేలేలా చేసుకున్నాడు. రోజుకు రెండు పూటలా, ఏకాగ్రతో క్రికెట్ నైపుణ్యాలపైనే దృష్టి పెట్టి తీవ్రంగా సాధన చేశాడు.
"అతడు రోజుకు రెండు పూటలా శిక్షణ చేశాడు. పగలు పూట 2-3 గంటల పాటు క్రికెట్ స్కిల్స్ పై పూర్తి దృష్టి పెట్టి, ఎంతో తీవ్రతతో ప్రాక్టీస్ చేశాడు. సాయంత్రం పూట 1-2 గంటల పాటు వర్కౌట్స్ లేదా స్పీడ్ ట్రైనింగ్ చేశాడు. ట్రైనింగ్ కోసం మరే ఇతర చోటికి వెళ్లలేదు. అదే ఈ రోజు అతడిని బలమైన, మెరుపు సెంచరీ చేసేలా చేసింది" అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
మార్పు అవసరం..
"కొన్ని సార్లు మనకు మార్పు అవసరం. అతడికి కూడా అంతే. మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతూ ఉండాలి. అతడు ముంబయి జట్టును వదిలి ఈ కొత్త జట్టులోకి రావడం వల్లే ఈ ఫలితం వచ్చింది." అని ఇషాన్ కిషన్ సెంచరీపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అన్నాడు.