శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఎడమమడమ గాయానికి గురైన హసరంగ కాస్త ఆలస్యమైనా తమ జట్టుతో చేరతాడని సన్రైజర్స్ హైదరాబాద్ భావించింది. కానీ తమ ప్రధాన ప్లేయర్ హసరంగ ఐపీఎల్లో ఆడటం కుదరదని బీసీసీఐకి లంక క్రికెట్ బోర్డు వెల్లడించిదని తాజా సమాచారం.
మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ను దృష్టిపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అంతేగాక దుబాయ్లోని వైద్యులు కూడా హసరంగ విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సూచించినట్లు సమాచారం. చికిత్స కోసం హసరంగ ఇటీవల దుబాయ్కు వెళ్లాడు.

అయితే ఐపీఎల్ ప్రారంభమైన సమయానికే జరిగిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు హసరంగను లంక బోర్డు ఎంపిక చేసింది. కానీ ఇప్పడు హసరంగ ఐపీఎల్కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. నిషేధం నుంచి తప్పించుకోవడానికే హసరంగను బంగ్లా సిరీస్కు ఎంపిక చేశారని వాదనలకు ఇది బలాన్ని చేకూరుస్తోంది.
మరోవైపు హసరంగ అందుబాటు గురించి ఎలాంటి స్పష్టత లభించకపోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అయోమయంలో పడింది. ఇతర ఆటగాడి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలా వద్దా అని ఆలోచిస్తోంది.అయితే హసరంగ దూరమవ్వడం హైదరాబాద్ జట్టుకు తీవ్ర ప్రతికూలమైన విషయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సీజన్ సగం గడిచిన తర్వాత స్లో పిచ్లపై హసరంగ బ్యాటర్లకు ప్రమాదకరంగా మారతాడని, అలాంటి మ్యాచ్ విన్నర్ దూరమవ్వడం సన్రైజర్స్కు ఎదురుదెబ్బే అని అభిప్రాయపడుతున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకున్న హసరంగను వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ.1.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విన్నర్ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్లు ఆడిన హసరంగ 35 వికెట్లు పడగొట్టాడు.
SRH జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్విర్సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్, హసరంగ.