IPL 2025: ఈ ఐపీఎల్ సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఫేవరేట్గా మొదలుపెట్టింది. మొదటి మ్యాచ్ లో బ్యాటర్లు దుమ్మురేపడంతో ఎస్ఆర్హెచ్ 286 పరుగులు చేసింది. ఇక ఈ సారి మనోళ్లు సత్తా చూపిస్తారని.. రఫ్ ఆడిస్తారని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ వరుసగా నాలుగు మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తు చిత్తుగా ఓడింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఏ విభాగంలోనూ కనీసం రాణించలేకపోయిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లోనూ దారుణంగా ఓడిపోయింది. 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా ఛేదించింది.
సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వచ్చిన అభిమానులతో మా వన్ ఇండియా ప్రతినిధి మాట్లాడగా.. ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలపైఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సన్రైజర్స్ ఓటమి పాలు కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి వైల్డ్ ఫైర్ కాదు.. నితీష్ పేరుకే రెడ్డి.. ఆరు కోట్లు దండగ అంటూ ఫైర్ అవుతున్నారు. నితీష్ వల్లే మ్యాచ్ ఓడిపోయిందంటూ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఓటమికి గల కారణాల గురించి కూడా అభిమానులు విశ్లేషించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ సరిగా లేదని.. ఒక వికెట్ పడిపోగానే అందరూ పెవిలియన్ దారి పడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సరిగా లేదంటూ వాపోతున్నారు.

సిమర్జీత్ సింగ్ బౌలింగ్ వల్లే మ్యాచ్ దొబ్బిందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చూసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ టికెట్ డబ్బులు బొక్క అంటూ ఫీల్ అవుతున్నారు. వాషింగ్టన్ సుందర్ హైదరాబాద్ తరపున గల్లీ క్రికెట్ ఆడేవాడని.. ఇప్పుడేమో స్టేడియం క్రికెట్ ఆడుతున్నాడని ఫ్యాన్స్ అన్నారు. గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. లోకల్ బాయ్ తన సత్తా చూపించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ పై 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. మరోసారి పేలవ బ్యాటింగ్ వల్ల సన్ రైజర్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలుపొందింది. లోకల్ భాయ్ మహ్మద్ సిరాజ్ సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో మహ్మద్ సిరాజ్ కు ఇదే కెరీర్ బెస్ట్ కావడం గమనార్హం.