Abhishek Sharma: ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరబాద్ తరఫున ఆడుతోన్న అభిషేక్ శర్మ .. ఈ సారి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇంకా చేయలేదు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 26.67 సగటుతో, 180.45 స్ట్రైక్ రేటుతో 240 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది. అయితే సాధారణంగా అభిషేక్ శర్మ అనగానే టక్కున గుర్తొచ్చేది.. విధ్వంసకర బ్యాటింగ్. కానీ ఈ సారి మాత్రం అతడు ఫీల్డింగ్ లో అదరగొడుతున్నాడు.
తాజాగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన 43వ మ్యాచులో ఈ ఆల్ రౌండర్.. తన మాస్టర్ క్లాస్ ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. ఏకంగా నాలుగు కీలక క్యాచులు పట్టుకుని, సీఎస్కేను 19.5 ఓవర్లలోనే 154 పరుగులకు కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. అతడి ప్రదర్శన కేవలం సీఎస్కేను కట్టడి చేయడమే కాదు.. తప్పక గెలవాల్సిన మ్యాచును పూర్తిగా ఎస్ఆర్హెచ్ కంట్రోల్ లోకి తీసుకొచ్చాడు.

ఈ మ్యాచులో షేక్ రషీద్, శివమ్ దూబె, దీపక్ హుడా, ధోనీ క్యాచులను పట్టుకున్నాడు అభిషేక్ శర్మ. స్లిప్, లాంగ్ ఆన్, పాయింట్, లాంగ్ ఆఫ్ పొజిషన్స్ లో నిలబడి ఈ క్యాచులను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ లో సీఎస్కేపై అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్ గా నిలిచాడు. మొత్తంగా ఈ ఐపీఎల్ సీజన్ లో 22 క్యాచులు పట్టుకోగా.. అందులో నాలుగు క్యాచులు సీఎస్కేతో తాజాగా జరిగిన ఈ మ్యాచులోనే అందుకోవడం విశేషం. ఐపీఎల్ లో అతడి మొత్తంగా క్యాచింగ్ ఎఫీషియన్సీ 71 శాతం ఉండగా, ఈ సీజన్ లో మాత్రమే 71.4 శాతం ఉండటం గమనార్హం.
అభిషేక్ తర్వాత ఉన్నది వీళ్లే..
అంతకుముందు ఏబీ డివిలియర్స్ (దిల్లీ క్యాపిటల్స్, జొహన్నెబర్గ్ 2009), ఆర్పీ సింగ్ (డీసీహెచ్, చెన్నై, 2010), ఏంజెలో మ్యాథ్యూస్ (పీడబ్ల్యూఐ, చెన్నై 2012), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్, బెంగళూరు, 2012).. సీఎస్కేపై తలో మూడు క్యాచులు పట్టుకున్నారు.
ఒత్తిడిలోనూ అతడు తప్పటడుగు వేయలే..
సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. అభిషేక్ శర్మ క్యాచులు గురించి మాట్లాడుతూ.. "అతడు తన క్యాచులతో మమ్మల్ని ఉత్తమ స్థానంలో ఉంచాడు. నిజంగా చెప్పాలంటే, అవి ఎంతో ఒత్తిడి క్యాచులు. కానీ అతడు ఎంతో జాగ్రత్తగా వాటిని ఒడిసిపట్టుకున్నాడు." అని అన్నాడు.