ఒట్టేసి చెబుతున్నా ఫిక్సింగ్ చేయలేదు
మొదటి నుంచి ఫిక్సింగ్ ఆరోపణల్ని ఖండిస్తూ వస్తున్న శ్రీశాంత్.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణల్ని మరోసారి ఖండించాడు. 'నా పిల్లల మీద, మా నాన్నపై ఒట్టేసి చెబుతున్నా. నేను మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడలేదు. నాకు ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదు, రాబోదు. గత ఐదున్నరేళ్లుగా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మా అమ్మ ఆరోగ్యం కూడా సరిగా లేదు. అయినా ఒక మ్యాచ్లో నన్ను చూడాలనే ఆశను మాత్రం వారు వదులుకోలేదు' అని శ్రీశాంత్ తెలిపాడు.
100 కోట్లు ఇచ్చినా ఫిక్సింగ్ చేయను
'నేను ఎప్పుడూ స్పాట్ ఫిక్సింగ్ చేయలేదు. రూ. 100 కోట్లు ఇచ్చినా ఫిక్సింగ్ చేయను. ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్లు క్రికెట్ ఆడుతున్నారు. మరికొందరు రిటైర్ అయ్యారు. నిందితులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఆధారాలతో సహా నిరూపించగలను. కానీ.. నేను ఆ పని చేయను. నా జీవితాన్ని తిరిగి పొందడానికి నాకు ఏడు సంవత్సరాలు పట్టింది. మన దేశంలో చాలా లీగ్లు ఉన్నాయి. కుటుంబాన్ని చూసుకోవాలంటే క్రికెట్లో పునరాగమనం చేయాల్సిన అవసరం నాకు ఉంది' అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ సారథ్యంలో ఆడాలని ఉంది
ఇంతకుముందు శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. 'అంబుడ్స్మన్ నిర్ణయంతో చాలా ఆనందంగా ఉన్నా. నా కోసం దేవుడిని ప్రార్థించిన శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు. నా ప్రార్ధనలు కూడా ఫలించాయి. ప్రస్తుతం నా వయసు 36. శిక్ష పూర్తయ్యేసరికి 37 ఏళ్లు వస్తాయి. టెస్టుల్లో ఇప్పటి వరకు 87 వికెట్లు తీశాను. 100 వికెట్లు తీసి నా కెరీర్ను ముగించాలనుకుంటున్నా. భారత టెస్ట్ జట్టులో తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం ఉంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడాలని ఉంది' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
చివరిగా 2011లో టీమిండియాకు ప్రాతినిధ్యం
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో తన రెండో ఓవర్లో ఉద్దేశపూర్వకంగా 14 పరుగులు ఇచ్చినందుకు రూ.10 లక్షలు తీసుకున్నాడని శ్రీశాంత్పై ఆరోపణలు ఉన్నాయి. భారత జట్టు తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో ఏడు వికెట్లు తీసాడు. చివరిగా 2011లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్లు గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్ ఉన్నాడు.