
హైదరాబాద్: ప్రస్తుతం యావత్తు క్రికెట్ ప్రపంచం ఆస్ట్రేలియా జట్టు చేసిన బాల్ టాంపరింగ్ గురించే మాట్లాడుకుంటోంది. క్రికెట్తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బాల్ టాంపరింగ్పై మాట్లాడుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ తీవ్రంగా కూడా ఈ బాల్ టాంపరింగ్ వివాదంపై స్పందించాడు.
బాల్ ట్యాంపరింగ్ అనేది ఇప్పుడే కనిపెట్టిన విషయమే కాదని, దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతుందని అన్నాడు. భారత క్రికెటర్లకు కూడా బాల్ ట్యాంపరింగ్ తెలుసునని, వారికి ఇది కొత్తేమీ కాదని శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్పై స్పందించిన భారత క్రికెటర్లు, మాజీలు ఓ సారి తన వివాదంపై కూడా స్పందిస్తే బాగుండేదని అన్నాడు.
త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానుంది కాబట్టి ఇప్పుడైనా, తనపై విధించిన క్రికెట్ నిషేదంపై ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఐసీసీ, బీసీసీఐ పెద్దలు తనకు క్రికెట్ మళ్లీ ఆడే అవకాశం ఇవ్వాలని కోరాడు. బాల్ టాంపరింగ్ క్లబ్ స్థాయి క్రికెట్లోనూ ఉందని, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ట్యాంపరింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని తెలిపాడు.
2013లో ఐపీఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. అప్పటి నుండి క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ శ్రీశాంత్ పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.