హైదరాబాద్: తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా పేసర్ శ్రీశాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీసీసీఐ దేవుడి కంటే ఎక్కువేం కాదని శ్రీశాంత్ ట్విట్టర్లో మండిపడ్డాడు.
'నేను అడుక్కోవడం లేదు. నా జీవనోపాధి నాకు తిరిగివ్వమని అడుగుతున్నా. మీరు(బీసీసీఐ) దేవుడు కంటే ఎక్కువ కాదు. మళ్లీ కచ్చితంగా ఆడతాను. ఒకసారి కాదు చాలా సార్లు నిరపరాధినని నిరూపించుకున్నా. అయినా బీసీసీఐ నీచంగా వ్యవహరిస్తోంది. ఎందుకో అర్థం కావడం లేదు' అని ట్విట్టర్లో శ్రీశాంత్ అన్నాడు.
క్రికెట్లో ఏమాత్రం అవినీతి, స్పాట్ ఫిక్సింగ్ని సహింబోమని బోర్డు చెబుతోందని మరి చెన్నై, రాజస్థాన్ల పరిస్థితి ఏంటని శ్రీశాంత్ ప్రశ్నించాడు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో శ్రీశాంత్ను మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టనీయకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని నిర్ణయించింది.