మైసూరు: దక్షిణాఫ్రికా-ఏతో మంగళవారం ప్రారంభం కానున్న రెండో అనధికార టెస్టులో భారత్-ఏ తలపడనుంది. భారత టెస్ట్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న పంజాబ్ యువ స్టార్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ మ్యాచ్లో గిల్ ఎలా ఆడుతాడనే ఆసక్తికరంగా మారింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో తాత్కాలిక కెప్టెన్గా ఉన్న గిల్ (90) అద్భుత ప్రదర్శన ఆకట్టుకున్నాడు. ఇతనికి తోడు బౌలర్లు రాణించడంతో ప్రొటీస్ను భారత్-ఏ సునాయాసంగా ఓడించింది.
పాక్కు ఎవరొచ్చినా పర్వాలేదు.. సిరీస్ గెలవడమే లక్ష్యం!!
ఇటీవలి కాలంలో భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న శుభ్మన్ గిల్ భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఒక వైపు గిల్ పరుగుల వరద పారించడం.. మరోవైపు కేఎల్ రాహుల్ చెత్త ఫామ్ కొనసాగించడంతో గిల్కు మార్గం సుగమం అయింది. దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం సీనియర్ జట్టులో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ప్రదర్శన ఈ మ్యాచ్లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గిల్ నుంచి సారథ్య పగ్గాలను సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తీసుకోనున్నాడు.
జట్టులో చోటు ఆశించి వెనుకబడ్డ ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్ ఫామ్ను కొనసాగించి సెలెక్టర్లను మెప్పించాలని పట్టుదలగా ఉన్నారు. అవకాశాలు వినియోగించుకోలేక వరుసగా విఫలమవుతూ వస్తున్న పంత్కు బదులు తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు సాహా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. స్పిన్ త్రయం నదీమ్, సక్సేనా, కృష్ణప్ప మరోసారి విజృంభిస్తే సఫారీలకు కస్టాలు తప్పవు. సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న ప్రోటీన్ యువ ఆటగాళ్లకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం.