
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్ కప్లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడకూడదని కొందరు క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న దేశంతో సంబంధాలు తెంచుకోవాలని ఐసీసీ సభ్య దేశాలను బీసీసీఐ కోరింది. వరల్డ్ కప్లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల సంక్షేమం, పటిష్ట భద్రత కోసం లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్ణయం
బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. బీసీసీఐ సైతం భారత ప్రభుత్వం పాక్తో మ్యాచ్ ఆడకూడదని ఆదేశిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడుతామని తేల్చి చెప్పింది. పాక్ను వరల్డ్కప్ నుంచి తప్పించాల్సిందిగా ఐసీసీని కోరే ప్రతిపాదనను కూడా వినోద్ రాయ్ ముందుకు తీసుకొచ్చినా.. తర్వాత విరమించుకున్నారు.

భారత్-పాక్ మ్యాచ్పై కపిల్ ఇలా
వరల్డ్కప్లో పాక్తో భారత్ ఆడాలా వద్దా? అన్న ప్రశ్నకు కపిల్ తనదైన శైలిలో స్పందించాడు. "ఆడొద్దని క్రీడాకారులకు ఎప్పుడూ చెప్పొద్దు. అలా కోరినప్పుడు ఎలా ఉంటుందో క్రికెటర్గా నాకు బాగా తెలుసు. ఆటగాళ్లకు ఆడటమే తెలుసు" అని కపిల్ దేవ్ చెప్పాడు. మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్ కూడా వరల్డ్కప్లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడి విజయం సాధించాలని అన్న సంగతి తెలిసిందే.

పాక్తో భారత్ ఆడకపోతే
వరల్డ్ కప్లో పాక్తో భారత్ ఆడకపోతే ఎంత నష్టం జరుగుతుందో చూద్దాం. ఈ ఏడాది వరల్డ్కప్ను ఐసీసీ రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తోంది. ఈ విధానం ప్రకారం టోర్నీలో పాల్గొంటోన్న ఒక జట్టు మిగతా అన్ని జట్లతో ఆడాలి. టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అంటే ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడుతుంది. చివరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు సెమీస్లో తలపడతాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. పాక్తో మ్యాచ్ రద్దు చేసుకున్నా తొలి నాలుగు స్థానాల్లో నిలిస్తే ఫర్వాలేదు. అలా కాకుండా మిగతా జట్లతో జరిగిన మ్యాచ్ల్లో భారత్ ఓడితే మాత్రం సెమీస్ చేరుకొనే అవకాశాలు చేజారుతాయి.


Click it and Unblock the Notifications












