హైదరాబాద్: బీసీసీఐకి నిజంగా ఇది ఊహించని షాకే. ఇకపై క్రికెటర్లకు కూడా డోప్ టెస్ట్లు నిర్వహించాల్సిదేనని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)ని ఆదేశించింది. భారత్లో జరిగే దేశీయ, అంతర్జాతీయ టోర్నీలకు ఈ టెస్టులు నిర్వహించాలని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దీంతో బీసీసీఐ నిర్వహించే అన్ని టోర్నీలకు డోప్ కంట్రోల్ అధికారులను పంపే పూర్తి అధికారాన్ని నాడాకు కట్టబెట్టారు. తాజా నిర్ణయంతో క్రికెటర్ల రక్తం, మూత్ర నమూనాలను సేకరించే అధికారం నాడాకు లభించింది. ఈ విషయమై గతంలోనే బీసీసీఐపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా వాడాని ఐసీసీని కోరింది.
బీసీసీఐ గనుక ఇందుకు అంగీకరించకపోతే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) రద్దు చేస్తామని కూడా వాడా గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. అయితే, తాజాగా నాడా నిర్వహించే డోపింగ్ పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరయ్యేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్కు వాడా లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో క్రికెటర్లకు కూడా డోప్ టెస్ట్లు నిర్వహించాల్సిదేనని కేంద్ర ప్రభుత్వం నాడాను ఆదేశించింది. 'నాడా అధికారులను వెళ్లి క్రికెటర్ల శాంపిల్స్ తీసుకోవాల్సిందిగా ఆదేశించాం. ఒకవేళ బీసీసీఐ తిరస్కరిస్తే.. కఠిన చర్యలకు కూడా వెనుకాడం' అని క్రీడల శాఖ కార్యదర్శి రాహుల్ భట్నాగర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్లో జరిగే మ్యాచ్లకే ఈ డోప్ టెస్టులను పరిమితం చేస్తానని, ఆ తర్వాత అన్నింటికీ వర్తింపజేస్తామని ఆయన తెలిపారు. నిజానికి దేశంలోని అన్ని క్రీడాంశాల్లో పాల్గొనే ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే అధికారం ఒక్క నాడాకు మాత్రమే ఉంది. అయితే ఎప్పుడంటే అప్పుడు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందంటూ ఇందులో ఉన్న ఓ నిబంధనను భారత క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.