'భలేగా మేనేజ్ చేస్తున్నాడు': కోహ్లీ వల్లే విజయాలు
హైదరాబాద్: ఇంగ్లాండ్పై ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 4-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.

కోహ్లీ స్ఫూర్తిదాయక నాయకత్వమే టీమిండియా విజయానికి కారణం
విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయక నాయకత్వమే టీమిండియా విజయానికి కారణమని కొనియాడాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన సందర్భంగా సనత్ జయసూర్య మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లాండ్ వంటి పటిష్ట జట్టును సులువుగా ఓడించిన టీమిండియా మంచి రిథమ్లో ఉందన్నాడు.

టీమిండియా మంచి రిథమ్లో ఉంది
'టీమిండియా మంచి రిథమ్లో ఉంది. ప్రపంచంలో మేటి జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ను అలవోకగా మట్టికరిపించింది. దీనికి కోహ్లీ కెప్టెన్సీనే కారణం. జట్టు సహచరుల్లో స్ఫూర్తినింపుతూ విజయాల్లో కీలకమవుతున్నాడు. అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను సద్వినియోగం చేసుకుంటూ అద్భుత ఫలితాలు రాబడుతున్నాడు' అని జయసూర్య అన్నాడు.

అటు కెప్టెన్గా, ఇటు వ్యక్తిగతంగానూ అద్భుత ప్రదర్శనలు
కోహ్లీ అటు కెప్టెన్గా, ఇటు వ్యక్తిగతంగానూ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడని జయసూర్య కితాబిచ్చాడు. వచ్చే వరల్డ్ కప్ను ఎవరు దక్కించుకునే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు 'ఆఫ్ కోర్స్ శ్రీలంకేనంటూ' నవ్వుతూ జయసూర్య సమాధానమిచ్చాడు.

కరుణ్ నాయర్పై కూడా జయసూర్య ప్రశంసలు
ఇక చెన్నైలో జరిగిన చివరి టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్పై కూడా జయసూర్య ప్రశంసలు కురిపించాడు. 'టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించడం అంత సులువు కాదు. దానికెంతో ఓపిక అవసరం. చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ దాన్ని చేసి చూపించాడు' అని తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే జట్టును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాని జయసూర్య అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications