అంటిగ్వా : 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్..' ఏ రంగంలోనైనా సరే వ్యక్తి తొలి అడుగులను బట్టే తర్వాతి పనితీరును అంచనా వేస్తుంటారు. టీమ్ ఇండియా నయా కోచ్ అనిల్ కుంబ్లే కూడా కోచ్ గా ఇప్పుడు తన తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. విండీస్ తో టీమ్ ఇండియా తాజా సిరీస్, కోచ్ గా కుంబ్లేకు తొలి సిరీస్ కావడంతో.. సరీస్ ఫలితంపైనే కుంబ్లే పనితనాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది.
అందుకే సిరీస్ లో తనదైన ముద్ర వేయాలని తాపత్రయపడుతున్నాడు కోచ్ కుంబ్లే. సిరీస్ కోసం ఆటగాళ్లను మానసికంగా సన్నద్దం చేస్తోన్న కుంబ్లే, ముందు బ్యాట్స్ మెన్ తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హెచ్చరించాడు. టీ20 ఫార్మాట్ మైండ్ సెట్ ను పక్కనబెట్టి టెస్టులకు తగ్గ రీతిలో ప్రదర్శన కనబరచాలని కుంబ్లే ఆటగాళ్లకు సూచించాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా క్రికెట్ కు సంబంధించిన ప్రతీ విషయంపై టెస్టులు నిజంగానే టెస్ట్ పెడుతాయని వ్యాఖ్యానించాడు కుంబ్లే. దాదాపు రెండు నెలలు ఐపీఎల్ తోనే బిజీగా గడపడం, అనంతరం కేవలం జింబాబ్వేతో మాత్రమే టీమ్ ఇండియా మ్యాచ్ లు ఆడడంతో, విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలని చెప్పినట్టుగా సమాచారం.

ఇదిలా ఉంటే, గురువారం నుంచి విండీస్ భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం అవబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లకు పలు సలహాలు సూచనలు ఇచ్చాడు కుంబ్లే. ముఖ్యంగా విండీస్ స్లో పిచ్ లపై పేసర్లు ఎలా రాణించాలి.. స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేయాలి అనే దానిపై తర్ఫీదు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సరీస్ లో స్పిన్నర్లు పాత్ర కీలకమని చెప్పిన కుంబ్లే.. బ్యాట్స్ మెన్ తరహాలోనే బౌలర్లు కూడా కలిసికట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పాలని ఆటగాళ్లకు తెలిపాడు. లోయర్ ఆర్డర్ లో అశ్విన్ రాణించడం భారత్ కలిసొచ్చే అంశమని, బ్యాట్స్ మెన్ మాత్రమే గాక బౌలర్లు కూడా పరుగులు చేయడానికి ప్రయత్నించాలని తద్వారా జట్టు విజయావకాశాలు మరింత మెరుగవుతాయని కుంబ్లే వివరించారు.